గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
భింద్ : మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఒక దళిత వ్యక్తిని పక్కింటి వ్యక్తులు దారణంగా కొట్టి హత్య చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి గ్రామంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ సంఘటన భింద్కు 65 కిలోమీటర్ల దూరంలో, దబోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని 35 ఏండ్ల దళిత వ్యక్తి రుద్ర ప్రతాప్ సింగ్ జాతవ్కు తమ పక్కింట్లో ఉండే కౌరవ్ కుటుంబంతో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కౌరవ్ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కర్రలతో జాతవ్పై దాడి చేశారు. దీంతో జాతవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వృద్ధుడు కూడా గాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన జాదవ్ను ముందుగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తరువాత మరింత మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరోవైపు జాతవ్ మరణించిన విషయం తెలియడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతవ్ బంధువులు, కొంతమంది గ్రామస్తులు దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరి ఇంటిని మంటలో తగలబెట్టారు. అలాగే ఇంటి బయట ఉన్న కారు, మోటార్ సైకిల్ను కూడా దహనం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు గురించి తెలిసిన జిల్లా ఎస్పీ అసిత్ యాదవ్, డిప్యూటీ ఎస్పీ సంజీవ్ పాఠక్ తమ పోలీసు బలగాలతో అక్కడకు చేరుకున్నారు. సమీపంలోని ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి కూడా అదనపు బలగాలను కూడా రప్పించారు. జాతవ్పై దాడికి పాల్పడిన రణవీర్ కౌరవ్, అషు కౌరవ్, ప్రహ్లాద్ కౌరవ్, రాజీవ్ కౌరవ్, కున్వర్ సింగ్ కౌరవ్లపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎస్పీ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఐదుగురు పరారీలో ఉన్నారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మధ్యప్రదేశ్లో దళిత వ్యక్తి దారుణ హత్య
- Advertisement -
- Advertisement -



