Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగుప్తనిధుల కోసం తవ్వకాలు

గుప్తనిధుల కోసం తవ్వకాలు

- Advertisement -

8 మంది రిమాండ్‌
నవతెలంగాణ-సిర్పూర్‌(టి)
గుప్త నిధుల కోసం అటవీ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు జరిపిన ఎనిమిది మందిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి)లో చోటుచేసుకుంది. ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్‌(టి) మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన నన్న రాజేష్‌ (రాజు) గతంలో ఒక కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో కోటాల మండలం గుండాయిపేటకు చెందిన రామ్‌టెంకి రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. అటవీ ప్రాంతంలో గుప్త నిధులున్నాయని, జైలు నుంచి విడుదలైన తర్వాత చూపిస్తానని రాజేష్‌ రాహుల్‌కు చెప్పాడు. జైలు నుంచి బయటకు వచ్చిన రాజేష్‌ లక్ష్మిపూర్‌ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ప్రదేశంలో తవ్వకాలు చేసి అక్కడి రాళ్లకు బంగారు రంగు పూసి వాటి ఫోటోలు, వీడియోలు తీసి రాహుల్‌కు పంపించాడు.

నిజంగానే బంగారం ఉన్నట్టు నమ్మిన రాహుల్‌ ఈ నెల 20న గుండాయిపేటకు చెందిన పాల్‌ రవి, దుర్గం మారుతీ, గొంగ్లే కిషోర్‌, చల్లూర్కార్‌ సాజన్‌, రామ్‌టెంకి సునీల్‌, కనికి గ్రామానికి చెందిన దుర్గం రాజారాంతో కలిసి గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని వారిని పట్టుకున్నారు. అనుమతి లేకుండా అటవీప్రాంతంలోకి ప్రవేశించి తవ్వకాలు జరిపినందుకు, జంతువుల ఆవాసాలను ధ్వంసం చేసినందుకు, వాటి సంచారానికి ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసిన వారిని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 13 రోజుల రిమాండ్‌ విధించారు. కేసు విచారణలో డీఆర్‌ఓ శశిధర్‌ బాబు, బీట్‌ ఆఫీసర్లు హబీబా, రవీనా, నరేష్‌, అరవింద్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -