జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వందేమాతరం గీతం ఆలపించటం మనకు దొరికిన మంచి అవకాశమని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు పాల్గొని వందేమాతరం గేయాన్ని కలెక్టరేట్లోని ఉద్యోగస్తులందరితో ఆలపించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తి అయ్యాయని, భారత స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపి రణ నినాదంగా ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు.
బెంగాలీలో రచించిన ఈ గేయం తెలుగులో ” భారతమాత నీకు వందనం, గలగల పారే ప్రవాహాలతో మలయ మారుతముల చల్లని గాలులతో, సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు… ” అని భారతదేశాన్ని కీర్తిస్తూ రచించారని, బెంగాల్ విభజన అయిన తర్వాత వందేమాతరం ఇంకా ప్రసిద్ధి చెందిందని, ఈ గీతం నేటికి కూడ అఖండ భారత దేశంలో ప్రతి ఒక్కరి నోట పలుకుతుండడం మన అదృష్టం అని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నరసింహ, గిరిజన సంక్షేమ అధికారి శంకర్, స్త్రీ, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, కలెక్టరేట్ సూపర్డెంట్లు సాయి, శ్రీలత టీఎన్జీవోస్ జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.



