చేతివేళ్లను సక్రమంగా పని చేయించడం కోసం ‘మోటారు స్కిల్స్’ను అభివృద్ది పరచడం అనేది ఆధునిక విద్యలో భాగమైంది. పిల్లలకు రాయడం వచ్చినప్పటినుండి బొమ్మలు గీయించాలి. పలకపై, కాగితాలపై, నేలపై, గోడలపై రాసిన వాటి గురించి ఓర్పుగా అడిగి తెలుసుకోవాలి. పిల్లల అంతరంగాన్ని చదవాలి.
మెదడుకు, హృదయానికి, చేతులకు సమన్వయం మొదలవుతుంది. గాంధి విద్యావిధానం ‘నయీ తాలిం’ నొక్కి చెప్పింది ఇదే. నైరూప్యత నుండి నిర్దిష్టతకు, సంక్లిష్టత నుండి స్పష్టతకు ఓ ప్రయాణం. నిజం చెప్పాలంటే ఇదే జీవనయానం. దీనినే ‘ఆర్ట్ అండ్ ఇన్నర్ ఎబిలిటి’ (కళ -అంతర్గత శక్తి) పాఠంగా ఎంతైనా చెప్పుకోవచ్చు. పిల్లలు గీసేవి పిచ్చి గీతలు కాదని, భావ వ్యక్తీకరణ సాధనాలని మనం గ్రహించాలి. ఆ ‘రహస్యం’ తెలుసుకుని పిల్లలను ప్రోత్సహిస్తూ భవిష్యత్కు బాటలు వేయాలి. నవంబర్ 14 చాచా నెహ్రూ జన్మదినం. మన బాలల దినోత్సవం. మనదేశ భవిష్యత్ను మన పిల్లల్లో చూడగలిగిన గొప్ప దేశభక్తుడు, దార్శనికుడు నెహ్రూ. యుద్ధాలు, వైషమ్యాలు, పర్యావరణ విధ్వంసం, కాలుష్య కాసారంగా మారుతున్న భూగోళం – ఈ నేపధ్యంలో బాల్యం సహజంగానే విస్మరణకు గురౌతున్నది. అందుకే మనం నవంబర్ 14ను బాలల పరిరక్షణా దినంగా పాటించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలి.
- కె.శాంతారావు, 9959745723


