అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం
నవతెలంగాణ – వనపర్తి
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఐడిఒసి ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం తో కలిసి కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజావాణి సహ సీఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులు, ఇంచార్జి మంత్రి నుండి వచ్చే దరఖాస్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.ఈరోజు ప్రజావాణికి మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు.
ప్రజావాణిని పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సైతం పాల్గొని పరిశీలించారు. ఫిర్యాదుదారులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పరిష్కరించదగిన ఫిర్యాదులన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తో పాటు అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



