– నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయదారులపై ఉక్కుపాదం : వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానాకాలం సాగుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వానాకాలం పంటల సాగుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల్లో టాస్క్ఫోర్స్ నిఘాను కట్టుదిట్టం చేయాలన్నారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ‘ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు. ఎక్కడెక్కడ నిల్వలున్నాయి. ఎక్కడ నుంచి రవాణా అవుతున్నాయనే అంశాలపై అధికారులకు సమాచారం ఉంది. ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలి. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలి’ అని సీఎం… సీఎస్ను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వానాకాలంలో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు.
ఆందోళన వద్దు
ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు భరోసానిచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని తెలిపారు. అందుకు అనుకూలంగా సరైన అదునులో పంటలు వేసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. విత్తన ప్యాకెట్లు తప్ప లూజ్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. విత్తన ప్యాకెట్లు కొన్న తర్వాత ఆ బిల్లును, ప్యాకెట్ కవర్లను పంట కాలం ముగిసే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ కంపెనీలు, కల్తీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.
వానాకాలం సాగుకు సన్నద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES