కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శికి
మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రంలో గౌరవెల్లి సహా.. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం నాడిక్కడ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయి కుమార్ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతు న్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం 2025 మేలో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని తెలిపారు. దీనిపై న్యాయసలహా తీసుకొని, అనుమతుల మంజూరు చేస్తామని తన్మయి కుమార్ తెలిపినట్లు మంత్రి వివరించారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని కార్యదర్శికి వివరించినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విదేశాల్లో ఉన్న కారణంగా తన్మయికుమార్ను కలిసి, ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చించినట్టు తెలిపారు. మంత్రి వెంట సెక్రెటరీ కోఆర్డినేషన్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.
గౌరవెల్లి సహా తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వండి
- Advertisement -
- Advertisement -


