Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅర్ధరాత్రి సీపీ ఆకస్మిక పర్యటన

అర్ధరాత్రి సీపీ ఆకస్మిక పర్యటన

- Advertisement -

పెట్రోలింగ్‌ వాహనంలోనే లంగర్‌ హౌజ్‌లో రౌడీ షీటర్ల ఇండ్లకు వెళ్లిన సీపీ
నేర చరిత్ర, జీవన విధానంపై ఆరా..
రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

లంగర్‌ హౌజ్‌, టోలిచౌకిల్లో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పెట్రోలింగ్‌ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. సైరన్‌, ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆ వాహనంలోనే లంగర్‌హౌజ్‌ పీఎస్‌ పరిధిలోని ఎండీ లైన్స్‌, ఆశాం నగర్‌, డిఫెన్స్‌ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇండ్లకు నేరుగా వెళ్లారు. రౌడీ షీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని హితవు పలికారు. అలాగే సౌత్‌ వెస్ట్‌ జోన్‌లోనూ సీపీ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12:00 గంటల నుంచి తెల్లవారుజాము 3:00 గంటల వరకు లంగర్‌ హౌస్‌, టోలిచౌకి పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. పెట్రోలింగ్‌ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టోలిచౌకి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి.. స్టేషన్‌ జనరల్‌ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను పరిశీలించారు. రాత్రి వేళల్లో పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. పీపుల్‌ వెల్ఫేర్‌ పోలీసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని అన్నారు. విజిబుల్‌ పోలిసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించిన ఆయన.. నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్టు చెప్పారు. నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యపైనా వెంటనే స్పందించే విధంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -