Thursday, November 27, 2025
E-PAPER
Homeజిల్లాలుపల్లె పాలనకు 61ఏళ్లు.!

పల్లె పాలనకు 61ఏళ్లు.!

- Advertisement -

– 1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు

నవతెలంగాణమల్హర్ రావు

ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభమైన గ్రామపంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది.ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ,పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని 1959 అక్టోబర్ 2న అమలు చేసింది.

మొదట్లో పరోక్ష పద్ధతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని దీనిలో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్ ను ఎన్నుకునే వారు. ఎన్నికైన సర్పంచ్ లు కలిసి సమితి ప్రెసిడెంట్ ఎన్నుకు నేవారు. సమితి ప్రెసిడెంట్ లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపా ధ్యక్షుడిని ఎన్నుకునేవారు.1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది.వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్పీలకు ఓటు హక్కు ఉండేది.

1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు..

1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వే షన్లు అమలు అవుతున్నాయి.

మండల వ్యవస్థతో మార్పులు..

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1988 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్ లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎన్నుకునేవారు.

ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994 ద్వారా పరిషత్ వ్యవస్థ..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం -1994 ద్వారా అదే సం వత్సరం నుంచి గ్రామ పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్లో సర్పంచ్ లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్సీ చైర్మన్ను ఎన్నుకోవడం ప్రారంభమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -