Monday, May 19, 2025
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ నివారణకు మా మద్దతు

డ్రగ్స్‌ నివారణకు మా మద్దతు

- Advertisement -

సీసీసీని సందర్శించిన సందర్భంగా మిస్‌ వరల్డ్‌ పోటీదారులు
మత్తు మందు నివారణ పోస్టర్లపై సంతకాలు, మెస్సేజ్‌లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

డ్రగ్స్‌ నివారణ కోసం తెలంగాణా పోలీస్‌ చేపట్టిన చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని 107 దేశాల మిస్‌వరల్డ్‌ పోటీదారులు ప్రకటించారు. ఈ మేరకు మత్తు మందు నివారణ పోస్టర్లపై సంతకాలు, మెస్సేజ్‌లు రాశారు. ఆదివారం వారు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని సందర్శించారు. సీసీసీకి చేరుకున్న వారికి పోలీస్‌ అశ్విక దళం, పైపు బ్యాండ్‌, మోటర్‌ సైకిల్‌ రైడర్స్‌, స్నిప్పర్‌ డాగ్‌ స్క్వాడ్‌లతో పోలీస్‌ శాఖ స్వాగతం పలికింది. పోలీస్‌ శాఖ అమలు చేస్తున్న విధి విధానాలపై ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలతో రాష్ట్రంలో 17 శాతం నేరాలు తగ్గాయనీ, వివిధ అంశాల్లో తెలంగాణా పోలీసులకు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయని వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ట్రాన్స్‌జెండర్ల సేవలను ట్రాఫిక్‌ విభాగంలో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. మొత్తం ప్రపంచానికే సవాలుగా మారిన సైబర్‌ నేరాల నియంత్రణలో అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామనీ, లక్షల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీటీవీలతో, రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా వెంటనే తగు చర్యలను చేపడుతున్నామని వివరించారు. ముఖ్యంగా సేఫ్టీ టూరిజంలో తెలంగాణ అత్యంత సురక్షితమైనదనీ, ఇందుకు రాష్ట్ర పోలీస్‌ చేపట్టిన పటిష్టమైన చర్యలే కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు, పిల్లలపై వేధింపుల నివారణ, డ్రగ్స్‌ కట్టడికి చేపట్టిన చర్యలు, నేరాల నియంత్రణ, నేర నివార ణలో ఉపయోగిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు తదితర అంశాలపై పోటీదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విధానాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణా పండగలు, సంస్కృతీ సంప్రదాయాలను కండ్లముందించేలా శాస్త్రీయ నృత్య ప్రదర్శనను తిలకించారు. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఆక్టోపస్‌, గ్రే హౌండ్స్‌, పోలీస్‌ జాగిలాల ప్రదర్శనలు, పైప్‌ బ్యాండ్‌, అశ్విక దళంలను కాంటెస్టర్లు ఆసక్తిగా పరిశీలించారు. సెల్ఫీలను దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నిరంతరం పరిశీలించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ గదిలో ఏర్పాటు చేసిన ఆధినిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సర్వేలెన్స్‌ ఫీడ్‌లు, తక్షణమే స్పందిం చే వ్యవస్థను మిస్‌ వరల్డ్‌ పోటీ దారులు స్వయ ంగా పరిశీలించారు. జీవన ప్రమాణాలు పెంపొందిం చడం, సురక్షిత టూరిజంకు, రాష్ట్ర అభివృద్ధికి భద్రతా చర్యలు ఎంతటి కీలక పాత్ర వహిస్తాయో తెలంగాణా పోలీస్‌ను ఉదాహరణ చెప్పవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరే రాష్ట్రంలో లేని విధంగా, ట్రాఫిక్‌ నియంత్రణా చర్యలకు సేవలందిస్తున్న ట్రాన్స్‌ జెండర్లతో కలసి మిస్‌వరల్డ్‌ పోటీదారులు ఫొటోలు దిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -