నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా అండగా ఉండి సర్పంచ్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బాగంగా సంగెం, వర్కట్ పల్లి, వలిగొండ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం నిర్వహించారు. వలిగొండలో సర్పంచ్ అభ్యర్థి కుంభం వెంకటపాపి రెడ్డి తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామాలలోని పేద ప్రజల అభివృద్ధిని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ,దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్న బియ్యం పథకం, రేషన్ కార్డులు, 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు, సాగునీటి కాల్వల అభివృద్ధి ప్రవేశ పెట్టి అమలు చేస్తుందని అన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను గెలిపిస్తే అభివృద్ధి శూన్యం అని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాలలోని పేద ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక స్థానాలు గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంభం విద్యాసాగర్ రెడ్డి, వెంకటపాపి రెడ్డి, శ్రీరామ్ రెడ్డి,బద్దం సంజీవ రెడ్డి, బందారపు లింగ స్వామి, గంగాధారి రాములు, బొల్ల శ్రీనివాస్, బత్తిని సహదేవ, కంకల కిష్టయ్యా, కొండూరు భాస్కర్, కాసుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



