– వండి తినే ఆహారం అనారోగ్యాలకు మూలం
– 11 రోజులు నియమంగా పండ్లను ఆహారంగా స్వీకరించాలి
– ప్రకృతి ప్రేమికులు, ఫ్రూటేరియన్ షేక్ మహమూద్ పాషా
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మానవుడు ప్రకృతిలో లభించే స్వచ్చమైన అన్ని పండ్లను ఆహారంగా భావించి ప్రతిరోజూ స్వీకరిస్తే నిజమైన ఆరోగ్య స్థితిని స్వయంగా గ్రహించగలడని ప్రకృతి ప్రేమికులు, విజనరీ, ఫ్రూటేరియన్, మండలంలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ హెచ్.ఎం షేక్ మహమూద్ పాషా తెలిపారు. ఆయన అభిప్రాయాలు నవతెలంగాణ ప్రతినిధితో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే.. ‘మానవులు ఆరోగ్యానికి అవసరమైన సరియైన ఆహార అవగాహనను కలిగి ఉండకపోవడమే ప్రస్తుత రోజుల్లో అధిక సంఖ్యలో అనుభవిస్తున్న సమస్త రోగాలకు ప్రధాన కారణం. ఆహారం కాని దానిని మనిషి ఆహారంగా స్వీకరిస్తున్నాడు. ఆరోగ్యం కావాలంటే శరీరానికి కావల్సిన సరైన ఆహారం తీసుకోవాలి. నిజానికి మానవుడు శరీరానికి కావాల్సింది తినకుండా, తన మనసుకు నచ్చింది తింటున్నాడు. వాటి వల్లే మనిషికి రోగాలు వస్తున్నాయి. అనాదిగా మానవుడు ప్రకృతి నుండి లభించే ఫలాలనే ఆహారంగా స్వీకరించేవాడు. కాలక్రమేణా ప్రకృతిలో మార్పులకు అనుగుణంగా మానవుడు ఓ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సీజన్లో లభించే పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరించాడు. సీజన్ మారినప్పుడు వేరే ప్రాంతానికి వలస వెళ్లడం చేశాడు. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండకపోవడం, తదితర కారణాలతో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహారాన్ని ఎలా తయారు చేయాలనే ఆలోచనలో పడ్డాడు మానవుడు. దానికి పరిష్కారంగానే వ్యవసాయాన్ని కనిపెట్టాడు. ఇలా మానవుడు తన ఆహార పంథాను వివిధ పరిస్థితులకు, కాలాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. అది కాస్తా నేటి సమాజంలో మనిషి పూర్తిగా తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకునే ఆహారాన్ని తయారు చేసుకుని, ఇటు మానవాళికి అటు ప్రకృతికి అత్యంత వినాశకారిగా మారిపోయాడు. ఎందరో మహానుభావులు(శాస్త్రవేత్తలు) తమ జీవితాలను ఫణంగా పెట్టి మానవ శరీరానికి శ్రేష్టమైన, ఆరోగ్యకరమైన ఆహారం.. ప్రకృతి సహజ సిద్ధంగా 6 రుతువుల క్రమంగా ఆయా చెట్ల నుంచి లభించే ఫలాలని గ్రహించారు. సగటు మనిషి ఫలాలను తినడం లేదనే విషయం మేధావులు తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రకృతిని అర్థం చేసుకున్న మనుషులు (వైద్యులు సైతం) తమ ఆహారంలో ఏదో ఒక పూట పండ్లను తినడం, ఇతరులకు తినమని చెప్పడం మనం చూస్తున్నాం. ఇలా పండ్లు మాత్రమే తిని నిత్య జీవితంలో అత్యద్భుతమైన, ఆరోగ్యకరమైన శరీర మార్పులను వారు గమనించారు. ఒక నెల రోజులు పూర్తిగా పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే, ఆ మనిషి శరీరం అద్భుతమైన స్వేచ్ఛను, అనుభూతిని పొందుతుంది. వండిన ఆహారమే మానవాళి వినాశనానికి మూలం. ఎంత తక్కువ వండిన ఆహారాన్ని భుజిస్తే అంత ఆరోగ్యకరమైన జీవితాన్ని మానవులు పెంచుకుంటారు. నిజంగా ఆరోగ్యం కావాలనుకునే వారు ఒకసారి నియమంగా 11 రోజుల పాటు పండ్లను ఆహారంగా తిని చూడాలి. మార్పు వారికే అర్థమవుతుంది. ఒక పనిని మనం చేసి, అర్థం చేసుకుని, అనుభవించినప్పుడే అది మన సొంతమవుతుంది.