మిర్చికి తెగులు

– నిలువునా ఎండుతున్న మిర్చి
– పెట్టుబడి మట్టి పాలు
– దిక్కుతోచక దున్నివేస్తున్న రైతులు
– ఎకరాకు రూ.1,50 లక్షల నష్టం
నవతెలంగాణ-కారేపల్లి
రైతుకు కాలం కలిసి రావటం లేదు. గతేడాది నల్లి తెగులుతో తోటలు తుడిచి పెట్టక పోగా ఈ ఏడాది కుళ్లుడు ఫంగస్‌ రైతును వెంటాడుతుంది. పూతకాత దశలో మిర్చికి కుళ్లుడు రోగం రావటంతో ఇంతవరకు పెట్టిన పెట్టుబడి మట్టిపాలు అయింది. ఇప్పటికి రైతులు ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. తీరా కాపువచ్చే దశలో ఎండు రోగం దాపురించి మిర్చి తోట అంతటి పాకుతుంది. కారేపల్లి మండలంలో 7500 ఎకరాల్లో మిర్చిని సాగు చేయగా 400 ఎకరాలు కుళ్లుడు రోగం వచ్చింది. కొందరు రైతులు మిర్చికి అధిక రేటుందని మక్కువతో కుళ్లుడు రోగం వచ్చినా దానిని దున్ని రెండు సార్లు తోటను వేసిన వారు ఉన్నారు. కొందరు మిర్చిని పూర్తిగా దున్ని రబీ పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేస్తున్నారు.

రెండున్నర ఎకరాల మిర్చితోట దున్నినా : వాంకుడోత్‌ హన్మంతరావు, రైతు
మూడు ఎకరాల్లో మిర్చితోట వేసినా మిర్చి తోట పూత కాపు కాసింది. ఈదశలో కుళ్లుడు రోగం వచ్చింది. దానికి ఎన్ని మందులు పిచికారి చేసిన దుక్కిలో మందు వేసినా అయినా ఫలితం లేదు. లేక లాభం లేదని తోటను పూర్తి దున్ని వేసి పత్తి వేసిన. ఇప్పటికి రూ.3.50 లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా ఏమి చేయాల్లో ఆర్ధం కావటం లేదు.

పంటమార్పిడి లేకనే తెగుళ్ల బారిన పంటలు : ఏవో కే.ఉమామహేశ్వరరావు
రైతులు పంటమార్పిడి పాటించక పోవటంతోనే మిర్చి తోటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. నీరు నిలువ ఉండే వంపు భూముల్లో కుళ్లుడు ఫంగస్‌ వస్తుంది. పంట మార్పి చేస్తే ఫంగస్‌ ప్రభావం ఉండదు. ఈ ఏడాది 5 శాతం తోటలు కుళ్లుడు రోగం సోకింది. దీని నివారణ లేదు కాని ట్రైకోథెర్మ్‌ విరిడి 2 కేజీలను 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేయటం ద్వారా కొంత ఫలితం ఉంటుంది.

Spread the love