– జోరుగా నీటి దందా…
– పుట్టగొడుగుల్లా వెలిసిన వాటర్ ప్లాంట్లు
– విచ్చలవిడిగా రసాయనాల వాడకం
– కోట్లల్లో వ్యాపారం
– రోగాల బారిన పడుతున్న ప్రజలు
– ఎక్కడ కనిపించని తనిఖీలు
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
జలమే జగతికి మూలం.. అలాంటి జలం గరళమవుతోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా తాగునీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. వేసవి కాలం కావడంతో ‘మూడు ప్లాంట్లు… ఆరు క్యాన్లు’ అనే తరహాలో దినదినాభివృద్ధి చెందు తోంది. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు లక్షలు సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నీటి శుద్దిలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించ కుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడుతున్నారు. క్యాన్ నీటికి అలవాటుపడిన ప్రజలు రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. పేరుకే మినరల్ వాటర్ కాని తాగి చూస్తే అంతా జనరల్ అని తెలుస్తోంది. జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో ప్రమాణాలు పాటిస్తున్నవి కొన్ని మాత్రమే. ఇంత జరుగుతున్నా అటు అధికారులు గాని, ఇటు పాలకులు గాని పట్టించుకోకపోవడం గమనార్హం.
పది రకాల అనుమతులు..
నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయలంటే పది రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్యాలకు ప్రధాన కారణం తాగు నీరేనని వైద్యులు చెబుతుంటారు. నీటిని కాచి, వడబోసి తాగమని సలహా ఇస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా మినరల్ వాటర్ పేరుతో సాధారణ జలాన్ని క్యాన్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా చేరడం వల్ల వాటిని తాగిన వారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. మినరల్ వాటర్ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో ఫంగస్ చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో వాటర్ ప్లాంట్లు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నెలకు రూ. కోట్లలో నీటి అమ్మకాలు..
వేసవి కాలంలో వాటర్ ప్లాంట్ల ద్వారా జోరుగా నీటి వ్యాపారం జరుగుతుంది. జిల్లాలో 75 శాతం మంది వాటర్ ప్లాంట్లకు సంబంధించిన నీటినే తాగు తున్నారు. దీంతో వాటర్ ప్లాంట్లకు మరింత డిమాండ్ పెరిగింది. 20 లీటర్ల క్యాన్ ధర ఇంటికి వస్తే రూ.10 నుంచి రూ.15 వరకు తీసుకుం టున్నారు. సగటున వాటర్ ప్లాంట్ల ద్వారా రోజుకు లక్ష పైచిలుకు నీటి క్యాన్లు సరఫరా అవు తున్నాయి. ఈ లెక్కన ఒక్క రోజులోనే రూ.15 లక్షల పైచీలుకు నీటి వ్యాపారం సాగుతోంది. వేసవిలో ఒక్కొక్క ప్లాంటు నిర్వాహకులు ప్రతీ రోజు 200 నుంచి 250 క్యాన్ల వరకు అమ్ముతున్నారు. జిల్లాలో ఉన్న వాటర్ ప్లాంట్ల ద్వారా నెలకు సుమారు రూ.5 కోట్లకు పైగా నీటి వ్యాపారం సాగుతోంది. ఇక ఎండా కాలం కావడంతో చల్లని తాగు నీటి పేరిట 15 లీటర్ల కూల్ క్యాన్కు రూ.50 వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు…
ఆధునిక యంత్రాల సహాయంతో బోరు నీటిని మూడు దశల్లో మినరల్ వాటర్గా తయారు చేయాల్సి ఉంటుంది. ముందుగా నీటిని క్లోరినేషన్ చేయాలి. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రత్యేకమైన శాండ్ ఫిల్టర్ ద్వారా వడబోసి, కార్బన్, మైక్రాన్ ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేయాల్సి ఉంటుంది. తర్వాత మరో కంపార్ట్మెంట్లోకి నీటిని పంపి ఆల్ట్రా వైలెట్, ఓజోనైజేషన్ ప్రక్రియ ద్వారా ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మార్చాల్ని ఉంటుంది. చివరి దశలో ఆక్సిజన్ పంపడం ద్వారా ఆక్సీకరణ జరిపి రంగు, రుచి, వాసన లేకుండా శుద్ది చేయాలి. ఈ నీటిని వారం రోజుల లోపు వినియోగించాలి. కానీ అందుకు విరుద్దంగా వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు వేసవి సీజన్ కావడంతో క్యాన్లలో బోరు నీటిని పట్టి వినియోగదారులకు అనుమానం రాకుండా రుచి కోసం మితిమీరిన రసాయనాలను కలుపుతూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. మిషన్ భగీరధ నీటిలో 150 మినరల్స్ ఉంటే వాటర్ ప్లాంట్ నీటిలో అతి తక్కువ మినరల్స్ మాత్రమే ఉంటాయి.
అనుమతులు తప్పనిసరి..
ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్కు బిఎస్ఐ అనుమతి పొందని వాటిపై జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. కానీ వారు వారీ కార్యాలయాల్లో అగుపించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేయరు. ఆ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వ హిస్తున్నారు. కనీసం ఫోన్లో కూడా స్పందించరు. నాన్ బీఎస్ఐల వాటిపై మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలి. వాటర్ ప్లాంట్ల నిర్వహణకు సంబంధించిన సమస్యలను మున్సిపల్ పరిధిలో ఆర్డీవోకు నివేదిస్తే ప్రభుత్వ నిబంధనలను పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేసే అధికారం ఆర్డీవోకు, గ్రామ పంచాయతీల పరిదిలో నిబంధనలను పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేసే అధికారం ఆయా మండలాల తహసీల్దార్లకు ఉంది. వాల్టా చట్టం 133 ప్రకారం లోకల్ అధికారులు నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి.
రసాయనాలు వాడే వారిపై చర్యలు తీసుకోవాలి : గడ్డం రమేష్, వినియోగదారుడు
నీటి శుద్ది కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటిం చడం లేదు. వాటిలో రుచి కోసం అనవసర రసాయనాలు వాడుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. వాటర్ ప్లాంట్లపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు కూడ ఎక్కువగా తీసుకోని ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వాటర్ ప్లాంట్లపై పట్టణాలలో అయితే మున్సిపల్, గ్రామాల లోనయితే పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది.