నవతెలంగాణ – ముంబయి: ముంబై శివార్లలోని ఓ బార్ లో ముగ్గురు యువతులు లేట్ నైట్ పార్టీ చేసుకున్నాక వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే దాడి చేశారు. మత్తు తలకెక్కడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా వారిని దుర్భాషలాడారు. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ చెయ్యి కొరకడమే కాకుండా ఆమె యూనిఫాంను చించేశారు. మరో కానిస్టేబుల్ తలపై బకెట్ తో కొట్టారు. అలాగే చేతినీ కొరికారు. చివరకు పోలీసులు అరెస్టు చేయడంతో దెబ్బకు వారి మత్తు దిగింది. నిందితులను కావ్య, అశ్వని, పూనంగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.