పైసలు పోయే.. ఫలితం లేకపాయే
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం డివిజన్ లో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తున్నారు. నోట్ల కట్టలు పాయే..ఓట్లు రాకపాయే అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఫలితాలు వెలువడిన బుధవారం వరకు అభ్యర్థులు చేసి ఖర్చు తడిసి మోపెడైంది.నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత..వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్య ర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబరాల్లో ముగిని తేలుతుండగా..ఓడిన వారు ఎక్కడ బోల్తాకొట్టామని సమీక్షించుకుంటున్నారు.
నమ్మకంగా వంచించారంటూ ఆవేదన..
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడ కుండ ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కులసంఘాల వారీగా, ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు ఓట్లను రాల్చకపోవడంతో ఏమైందనే ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.వేల వరకు పంపిణీ చేశారు. ఇంకా కులసంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందుపార్జీలు అదనం. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ చేసిన అభ్యర్థులు గెలుపు అంచు వరకు వెళ్లి ఓడిపోవడంతో అవాక్కయ్యారు. నమ్మకంగా వంచించారంటూ కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. గ్రామాల్లో పక్షం రోజులుగా సగటును ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అనధికారికంగా వెచ్చిం చారు.



