ఉప ఎన్నిక వస్తే నేనే గెలుస్తా..
నా బలం కార్యకర్తలే..: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ- హిమాయత్నగర్
సీఎం ఎ.రేవంత్రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులేనన్నారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజరు మాట్లాడుతున్నారని, వాళ్లు కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా స్పష్టత ఇవ్వాలన్నారు. హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజరు పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉంటాయని, అవినీతిపై ఆధారాలుంటే విచారణ చేపట్టాలని అన్నారు. తన బలం కార్యకర్తలేనని, ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లేనన్నారు. తాను రాజీనామా చేయడానికి.. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం కూడా తన కార్యకర్తలేనని తెలిపారు. వారి అండతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.



