నవతెలంగాణ – విజయవాడ: దుర్గ గుడి ఏఈవో వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. టెండర్ కోసం గుత్తేదారుకు నకిలీ అనుభవ ధ్రువపత్రం జారీ చేసినందుకు ఆయనను ఆలయ ఈవో భ్రమరాంబ సస్పెండ్ చేశారు. అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన టెండర్ వ్యవహారంలో ఓ వ్యక్తికి లేని అనుభవం ఉన్నట్లుగా ఏఈవో ఇటీవల ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. టెండర్లో పాల్గొనేందుకు ఆ కాంట్రాక్టర్కు ఏఈవో సహకరించారని ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని ఆలయ ఈవో దృష్టికి తేకుండానే ఆయనను కూడా తప్పుదోవ పట్టించాడన్న వ్యవహారంపైనా ప్రాథమికంగా విచారణ జరిపారు. ఆలయంలోనే అంతర్గతంగా విచారణ జరిపిన అనంతరం ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు తేల్చారు. దీంతో ఆయనపై ఆలయ ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకుంటూ ఏఈవోపై సస్పెన్షన్ వేటు వేశారు.