వాషింగ్టన్ : గాజాపై ఏర్పాటు చేసిన బోర్డులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్లను ట్రంప్ ప్రభుత్వం వ్యవస్థాపక సభ్యులుగా నియమించింది. ట్రంప్ రాయబారి (మధ్యప్రాచ్యం) స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ‘ఫౌండింగ్ ఎగ్జిక్యుటివ్ బోర్డు’లో ఉంటారని అధ్యక్ష భవనం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. బోర్డుకు ట్రంప్ చైర్మెన్గా వ్యవహరిస్తారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బోర్డును ఏర్పాటు చేశారు. గాజా రోజువారీ కార్యకలాపాలు, పునర్నిర్మాణ పనులను ఈ బోర్డు తాత్కాలికంగా పర్యవేక్షిస్తుంది.
కాగా ఓ ప్రయివేటు ఈక్విటీ సంస్థ అధిపతి మార్క్ రోవన్, ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ కూడా ఫౌండింగ్ ఎగ్జిక్యుటివ్ బోర్డు సభ్యులుగా ఉంటారు. రాబోయే వారాల్లో మరికొంతమంది సభ్యులను బోర్డులో చేరుస్తారు. శాంతి బోర్డులో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న టోనీ బ్లెయిర్ 1997-2007 మధ్యకాలంలో బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. 2003లో ఆయన బ్రిటన్ను ఇరాక్ యుద్ధంలో భాగస్వామిని చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత అమెరికా, ఈయూ, రష్యా, ఐరాస తరఫున మధ్యప్రాచ్య రాయబారిగా వ్యవహరించారు.
గాజా ‘శాంతి బోర్డు’లో బ్లెయిర్, రుబియో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



