నవతెలంగాణ హైదరాబాద్: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడంతోతెలంగాణలో జగిత్యాల రాజకీయాలు గత కొద్దిరోజులుగా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీలోని కొందరు సినీయర్ నేతలు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్. రమణ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా జగిత్యాల నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమణను కేసీఆర్ గతంలో మంత్రి పదవి ఆఫర్ చేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రిపదవి మాత్రం రమణకు దక్కలేదు. దీంతో ఆయన కేసీఆర్ తీరుపై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో జగిత్యాలలో తన ప్రాధాన్యత తగ్గిందని కూడా రమణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన కవితను కలిశారని టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దం అవుతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కవిత ఇంటి ముందు ఓ కారు నిలిచి ఉండగా అది ఎమ్మెల్సీ రమణదేనని, ఆ కారులో వచ్చి కవితను కలిసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తేలాలంటే కవిత గానీ రమణ గానీ స్పందించాల్సి ఉంది.



