బీజేపీ, రేవంత్ రెడ్డి ఓట్లు గల్లంతు చేస్తారు
బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపడతా : మాజీ మంత్రి, టీ.హరీశ్రావు
నవతెలంగాణ-జోగిపేట
ఢిల్లీలోని బీజేపీ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు గల్లంతు చేసే పనిలో ఉన్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్యూమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపి ఇవ్వాలని మాజీ మంత్రి టీ. హరీశ్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల కేంద్రంలోని లక్ష్మినర్సింహ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ బూత్ లేవల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సర్ కార్యక్రమంలో పార్టీ బీఎల్ఏలు ప్రజలకు అందుబాటులో ఉండి ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధును ఎగ్గొట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, గొర్రెలు, చేపల పంపిణీ, దళిత బంధు, కేసీఆర్ కిట్టు, ఉచిత కరెంటు, రైతు బీమా, ఇందిరమ్మ రైతు భరోసా వంటి పథకాల అమలు ఏమైందని ప్రశ్నించారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలు ఇవ్వలేదన్నారు. గురుకులాలు, విద్యుత్, బొగ్గు, సివిల్ సప్లయి ఇలా అనేక సంస్థలలో స్కామ్లు జరిగాయన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ స్కాముల ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. యూరియా యాప్తో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సింగూరు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి
సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల పేరుతో నీళ్లు ఖాళీ చేసిన ప్రభుత్వం రైతులకు క్రాఫ్ హాలిడే క్రింద ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో 40 వేల ఎకరాలకు నీరు అందించి రెండు పంటలు పండించామని ఆయన గుర్తు చేశారు.
త్వరలో పాదయాత్ర
బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టు సాధన కోసం త్వరలో పాదయాత్ర చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని, నావెంట నడిచే వాళ్లు సిద్దంగా ఉండాలని హరీశ్రావు స్పష్టం చేశారు. సింగూరు కాలువల ద్వారా అందోలు, పుల్కల్ మండలాలకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే అందోలు నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. నారాయణఖేడ్లోని బోరంచ నుంచి జహీరాబాద్లోని రెేజింతల్ సిద్దివినాయక అలయం వరకు పాదయాత్ర చేసి కాంగ్రేసోళ్లకు జ్ఞానోదయం కలగాలని మొక్కుదామన్నారు. బసవేశ్వర -సంగమేశ్వర ప్రాజెక్టు పనులను ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి బాలమల్లు, నియోజకవర్గ ఇన్చార్జి పట్నం మాణిక్యం, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



