- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ డిమాండ్
నవతెలంగాణ-కంఠేశ్వర్: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం నగరంలోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి, ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ప్రజలను మోసం చేయటమే అవుతుందని విమర్శించారు. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల పైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేశారని, ప్రజల దృష్టిని మరల్చడం కొరకు జాతీయతా భావం, మతం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని.
ఇప్పుడు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజానికం పై నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతుందని ఇది సరైన పద్ధతి కాదని ,ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ఐదు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందు ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. రేపు పార్టీ ఆధ్వర్యంలో ఆయా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, పి.వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, మరియు నగర నాయకులు నరసయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



