నవతెలంగాణ-హైదరాబాద్ : తమను ఆలయంలోకి రానివ్వలేదని దళితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటనలు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మంగళవారం జరిగింది. పెగడపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దళితులు బోనాలతో ఎల్లమ్మ తల్లి ఆలయానికి మొక్కులు చెల్లించేందుకు సోమవారం రాత్రి వెళ్లారు.
అయితే గౌడ సంఘం సభ్యులు కొందరు మహిళలు మమ్మల్ని గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని దళితులు మండిపడ్డారు. కుల వివక్షతో తమను అడ్డుకున్నారని బోనాలతో మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రెడ్డితో పాటు ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటన పై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



