– బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలు వెంటనే సమర్పించాలి
– అశ్వారావుపేట నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి,తహశీల్దార్ దాసరి కిషోర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని నియోజక వర్గ సహాయ ఎన్నికల అధికారి,తహశీల్దార్ కిశోర్ కోరారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. బీఎల్వోలు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని తెలిపారు. జూన్ 2026 నుండి బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపట్టి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని చెప్పారు. ప్రతి ఓటరు ఇంటిని కనీసం ఒకసారి సందర్శించి, అవసరమైతే మూడు సార్ల వరకు వెళ్లి ఫారాలను సేకరిస్తారని వివరించారు.
ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియ జూన్ 26 నుండి ప్రారంభమై 24 – 07 – 2026 నాటికి పూర్తవుతుందని తెలిపారు. అనంతరం 31 – 07 -2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, 31 – 07 – 2026 నుండి 30-08-2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. తుది ఓటరు జాబితా 01 – 10 – 2026న ప్రచురిస్తామని వెల్లడించారు. చిరునామా మార్పులు, ఇతర సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అలాగే, 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారు ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, 01 అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే వారికి కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఓటర్లు తమ పేరు ఎస్ఐఆర్-2002 జాబితాలో ఉందో లేదో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్ లేదా ఈసీఐ ఓటర్స్ పోర్టల్లో “సెర్చ్ బై ఎలోక్టోరల్ డిటెయిల్స్ ” ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆధార్ నంబర్ సమర్పణ పూర్తిగా ఐచ్చికమని స్పష్టం చేశారు. ఫారం నింపడం లో లేదా వివరాల ధృవీకరణ లో సహాయం కోసం బీఎల్వో లు, 1950 హెల్ప్లైన్, ఈసీఐ ఓటర్స్ పోర్టల్, అలాగే “బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో” సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న ఓటర్ల తరపున కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఫారం నింపి బీఎల్వో కు సమర్పించవచ్చని తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యత, ఫారాల నింపే విధానంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.



