కేంద్రం, ఎన్టీఏ
పరస్పర విరుద్ధ వాదనలు
లోపాన్ని ఒప్పుకున్న విద్యాశాఖ మంత్రి
సిస్టమ్ ద్వారా లీక్ జరగలేదన్న ఎన్టీఏ చీఫ్
వేర్వేరు ప్రకటనలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం
న్యూఢిల్లీ : నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాదనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ‘చైన్ ఆఫ్ కమాండ్లో లోపం జరిగిందని అంగీకరించగా.. ఎన్టీఏ డీజీ మాత్రం ‘సిస్టమ్(వ్యవస్థ) ద్వారా ప్రశ్న పత్రం లీక్ కాలేదు’ అని అంటున్నారు. ఇప్పుడు ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరింత గందరగోళాన్ని పెంచుతున్నాయి. దీంతో లీక్ వ్యవ హారంలో అసలు బాధ్యత ఎవరిది? తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయ త్నాలను కేంద్రం, ఎన్టీఏలు చేస్తున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక పరీక్షను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్రం విఫలమైందన్న విమర్శలు సర్వ త్రా వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థి తుల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం తప్పును ఒప్పుకున్నారు.
పరీక్ష నిర్వహణ వ్యవస్థలో లోపం జరిగిందని అంగీకరించారు. అయితే ఎన్టీఏ వాదన మాత్రం ఇంకోలా ఉంది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ (డీజీ) అభిషేక్సింగ్ మాత్రం.. ప్రశ్నపత్రం వ్యవస్థ ద్వారా లీక్ కాలేదని ఈనెల 21న పార్లమెంటరీ కమిటీ ఎదుట చెప్పినట్టు వెల్లడి కావడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ‘చైన్ ఆఫ్ కమాండ్లో లోపం జరిగింది’ అని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం దీనిపై బాధ్యత తీసుకుంటోందని కూడా ఆయన తెలిపారు. ఇక్కడే ఇటు ప్రభుత్వం, అటు ఎన్టీఏ నుంచి భిన్నవాదనలు వినబడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘వ్యవస్థలో లోపం జరిగింది’ అని ప్రభుత్వం చెప్తుంటే.. ఎన్టీఏ మాత్రం ‘సిస్టమ్ ద్వారా లీక్ కాలేదు’ అని ఎందుకు చెప్తోంది? అనే ప్రశ్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా ‘సిస్టమ్’ అంటే కేవలం కంప్యూటర్ సర్వర్ లేదా డిజిటల్ నెట్వర్క్ మాత్రమే కాదు. ప్రశ్నపత్రాల ముద్రణ, ప్యాకేజింగ్, రవాణా, భద్రపరిచే ప్రక్రియ, పరీక్షా కేంద్రాల నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ… ఇవన్నీ కూడా పరీక్షా వ్యవస్థలో భాగమే. ఆ గొలుసు(చైన్)లో ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వెళ్తే, అది మొత్తం వ్యవస్థ వైఫల్యంగానే కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చలో అసలు సమస్య సాంకేతిక పదజాలం కాదని అంటున్నారు. ప్రభుత్వం లోపాన్ని ఒప్పుకోగా.. ఎన్టీఏ మాత్రం ‘లీక్’ అనే పదాన్ని తప్పించు కుంటోందని చెప్తున్నారు.
సంస్థల విశ్వసనీయతపై అనుమానాలు
ఇక వివాదంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసిన విషయం విదితమే. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థే దీనిని ‘పేపర్ లీక్ కేసు’గా చూస్తోంది. ఎన్టీఏ మాత్రం ‘సిస్టమ్ ద్వారా లీక్ కాలేదు’ అనే పరిమిత వ్యాఖ్యకు మాత్రమే ఎందుకు కట్టుబడి ఉందన్న ప్రశ్నలు సర్వత్రా కలుగు తున్నాయి. ఇప్పుడు సమస్య కేవలం పేపర్ లీక్ అయ్యిందా లేదా? అన్నది మాత్రమే కాదనీ, పరీక్షలు నిర్వహించే సంస్థలు నిజాలను పూర్తిగా పారదర్శకంగా చెప్తున్నాయా లేదా? అన్నది ముఖ్యమనీ, ఇప్పుడిదే అనేక అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. పరీక్ష వ్యవస్థలో ఏ ఒక్క విభాగం విఫలమైనా.. మొత్తం వ్యవస్థపైనే విశ్వాసం దెబ్బతింటుందనీ, ప్రస్తుతం నీట్ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. మోడీ సర్కారు వైఫల్యానికి లక్షలాది మంది విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు.



