న్యూఢిల్లీ : దేశీయ పోటీల్లో పాల్గొనడానికి రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించిన నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ఈ నిర్ణయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ ఐ)ని తీవ్రవంగా మందలించింది. రానున్న ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్లో ఫోగాట్ పాల్గొనడాన్ని ఖరారు చేయడానికి, అలాగే ఆమె ఫిట్నెస్ను మూల్యాంకనం చేసేందుకు తక్షణమే ఒక నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో మాతృత్వాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రసూతి సెలవుల అనంతరం వినేష్ ఫోగట్ తిరిగి క్రీడల్లోకి ప్రవేశించడాన్ని స్వాగతిస్తూ.. గత ఎంపిక ప్రమాణాలను పక్కనబెట్టి డబ్ల్యు ఎఫ్ ఐ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది. విరోధమేదైనా లేదా వివాదమేదైనా కావచ్చు.. కానీ రెజ్లింగ్ ప్రయోజనాలను ఎందుకు దెబ్బతీయాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పారిస్ ఒలింపిక్స్ లో బరువు పరిమితిని పాటించకపోవడం, డోపింగ్ నిరోధక సమస్యలు, ఒలింపిక్ క్వాలిఫైర్ ట్రయల్స్ సమయంలో రెండు విభాగాల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ మే 9నడబ్ల్యూఎఫ్ ఐ ఫోగట్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
2024 పారిస్ ఒలింపిక్స్ నుండి అనర్హురాలిగా ప్రకటించబడిన తర్వాత ఆమె క్రీడలకు విరామం ప్రకటించారు. గతేడాది జులైలో బిడ్డకు జన్మనిచ్చిన ఫోగట్, 2025 డిసెంబర్ 12న తన పదవీ విరమణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అనంతరం గోండాలో జరిగిన నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్కు ఆమె హాజరయ్యారు. అయితే ఆమెను పోటీల్లో పాల్గొనేందుకు డబ్ల్యు ఎఫ్ ఐ అనుమతి నిరాకరించింది. డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం పదవీ విరమణ నుండి తిరిగి వచ్చే క్రీడాకారులు పాటించాల్సిన ఆరు నెలల నోటీసు వ్యవధిని ఆమె పూర్తి చేయలేదని, దీంతో ఆమెను పోటీలకు అనుమతించలేమని డబ్ల్యు ఎఫ్ ఐ పేర్కొంది. డబ్ల్యూఎఫ్ ఐ ఆదేశాలను సవాలు చేస్తూ వినేష్ ఫోగట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
డబ్ల్యూ ఎఫ్ఐపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు
- Advertisement -
- Advertisement -



