8 రోజుల్లో మూడోసారి
తాజాగా 90పైసలు పెంపు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఇది మూడోసారి పెరగడం. దేశవ్యాప్తంగా, అన్ని వేరియంట్లలోనూ తాజాగా లీటరుకు సగటున 90పైసలు పెరిగింది. అంతేగాకుండా, ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంప్రెస్డ్ నేచరుల్ గ్యాస్ (సీఎన్జీ) ధర ఇదే కాల వ్యవధిలో మూడోసారి కిలోకు రూపాయి చొప్పున పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి లీటరు ధర రూ.99.51కి చేరుకోగా, డీజిల్ ధర 91పైసలు పెరిగి, లీటరుకు రూ.92.49కి చేరుకుంది. ప్రీమియం వేరియంట్ డీజిల్ ధర లీటరుకు రూ.97.81కి చేరింది. ఇక హై ఆక్టేన్ వేరియంట్కి చెందిన పెట్రోల్ ఎక్స్పి 95 ధర 87పైసలు పెరిగి లీటరు ధర రూ.106.63కి చేరుకుంది. ఇతర మెట్రోలు ముంబయి, ఢిల్లీ, చెన్సైలతో పోల్చుకుంటే కోల్కతాలో ఎక్కువగా ఈ పెంపు కనిపిస్తుంది.
అలాగే ఇతర మెట్రోలతో పోలిస్తే చైన్నైలో పెంపు ఒక మోస్తరుగానే వుంటుంది. చెన్నైలో 82పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.105.31కి పెరగగా, డీజిల్ ధర 87పైసలు పెరిగి లీటరు రూ.96.98కి చేరింది. తాజాగా కోల్కతాలో లీటరు పెట్రోల్కు 94పైసలు పెరిగి లీటరు రూ.110.64కి చేరుకుంది. డీజిల్ కూడా 95పైసలు పెరిగింది. లీటరు ధర రూ.97.02కి చేరుకుంది. ముంబయిలో 90పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.108,49కి చేరుకోగా, డీజిల్ ధర 94పైసలు పెరిగి, లీటరు ధర రూ.95.02కి చేరుకుంది. ఢిల్లీలో దేశ రాజధాని ప్రాంతం (ఎన్సిటి)లో సిఎన్జి ధర కిలోకు రూ.81.09కి చేరుకుంది. మే 15నుండి వరుసగా పెరుగుతున్న ధరల పెంపుతో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు మొత్తంగా లీటరుకు రూ.4.8 చొప్పున పెరిగాయి. మొట్టమొదటసారిగా లీటరుకు మూడు రూపాయిలు చొప్పున పెరగగా, ఆ తర్వాత సగటున లీటరుకు 90పైసలు చొప్పున రెండుసార్లు మే 19, 23 తేదీల్లో పెరిగాయి. పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు ఆటంకం కలిగింది. దాంతో ముడి చమురు ధరలు బాగా పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.



