Tuesday, February 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికార్పొరేట్‌-హిందూత్వ మాయాజాలం

కార్పొరేట్‌-హిందూత్వ మాయాజాలం

- Advertisement -

”మాటలు కాదు, చేతలు చూడాలి” అంటారు పెద్దలు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాటలతో ప్రజలను మభ్యపెట్టి, చేతలతో వారి జీవితాలను మరింత కష్టతరం చేస్తోంది. పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌ ఈ ప్రభుత్వ ఆర్థిక విధానానికి మరో స్పష్టమైన సాక్ష్యం. ఈ బడ్జెట్‌ అవసరాల కోసం రూపొందినది కాదు, కార్పొరేట్‌ మూలధనం, కమ్యూనల్‌ రాజకీయాల కలయికలో తయారైన లెక్కల మాయాజాలం మాత్రమే. వారు తయారు చేసినదే ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో చదివారు. బడ్జెట్‌ అనేది కేవలం ఆదాయ, వ్యయాల పట్టిక కాదు. అది ఏ ప్రభుత్వానికైనా తన వర్గ స్వభావాన్ని బహిర్గతం చేసే రాజకీయ పత్రం. ఎవరి నుంచి ఆదాయం వసూలు చేస్తారు? ఆ డబ్బును ఎవరి కోసం ఖర్చు చేస్తారు? అన్న ప్రశ్నలకు బడ్జెట్‌ స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఆ కోణంలో చూస్తే, ఈ బడ్జెట్‌ పేదలు, కార్మికులు, రైతులు, గ్రామీణ కూలీలకు సంబంధించినది కాదు. ఇది ధనవంతుల ప్రయోజనాలను కాపాడే విధాన ప్రకటన.

బడ్జెట్‌ ఎలా ఉందంటే?
నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు, ధరలు ఎగబాకుతున్న ప్పుడు, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నప్పుడు, కార్మికుల కష్టాలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వ బడ్జెట్‌ ఉత్పత్తి పెంపు, ఉపాధి సృష్టి, ప్రజల కొనుగోలు శక్తి పెంపుపై దృష్టి పెట్టాలి. ప్రజా పెట్టుబడులను పెంచి, సంక్షేమాన్ని బలోపేతం చేయాలి. ఇది కనీస ఆర్థిక తర్కం. కానీ, ఈ బడ్జెట్‌ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రజా ఖర్చులను పెంచడం బదులు వాటిని కత్తిరించడం, సంక్షేమ పథకాలను బలపరచడం బదులు నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం బదులు ప్రయివేటీకరణకు దారులు వేయడం – ఇవే ఈ బడ్జెట్‌ అసలు లక్షణాలు. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడమే కాదు, దాని భారాన్ని ప్రజలపైకి నెట్టడమే ఈ విధానం. ఈ బడ్జెట్‌ మోసాన్ని అర్థం చేసుకోవాలంటే ”సవరించిన అంచనాలు” అనే పదాన్ని గమనించాలి. బడ్జెట్‌లో కేటాయింపులు ప్రకటించేటప్పుడు పెద్ద అంకెలు చూపించి ప్రజల ముందు గొప్పగా నిలబడటం, ఏడాది చివరికి వచ్చేసరికి ఆ నిధులను ఖర్చు చేయకుండా వెనక్కి తగ్గడం, ఇదే ఈ ప్రభుత్వ ఆర్థిక శైలి. చప్పట్ల కోసం కేటాయింపులు, ముంచడానికి కోతలు అన్నట్లుగా ఈ వ్యవహారం సాగుతోంది.

సవరణ పేరుతో అడ్డగోలు కోతలు
2025-26 బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లుగా ప్రకటించారు. కానీ, సవరించిన అంచనాల్లో దాన్ని 49,64,842 కోట్లకు తగ్గించారు. అంటే ప్రకటించిన ఖర్చులోనే దాదాపు లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుంది.ఇప్పుడు మళ్లీ 53,47,315 కోట్లు అంటూ కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టి, గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగిందని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇది బడ్జెట్‌ అంచనాలతో పోలిక మాత్రమే. వాస్తవంగా ఖర్చు చేసిన సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది కేవలం రెండు శాతం మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది పెరుగుదల కాదు, ప్రజా ఖర్చుల కుదింపు. సాధారణ ప్రజలకు కాగితాల మీద పులిలా కనిపించే ఈ బడ్జెట్‌, ఖర్చుచేసే దగ్గరకు వచ్చేసరికి పిల్లిలా మారిపోతుంది. ఇదే ఈ అంకెల గారడీ, ఇదే ఈ బడ్జెట్‌ అసలు స్వరూపం. సవరించిన అంచనాల పేరుతో ప్రభుత్వం దాదాపు రూ.1,40,000 కోట్లకు పైగా నిధులను ప్రజలకు సంబంధించిన రంగాల నుంచి కత్తిరించింది.

కార్పొరేట్లకు రాయితీలు, ప్రజలపై భారాలు
ఈ బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు కేవలం 11-12 లక్షల కోట్ల మధ్యే ఉన్నాయి. కానీ పరోక్ష పన్నులు, ముఖ్యంగా జీఎస్టీ 14-15 లక్షల కోట్లకు చేరాయి. అంటే ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరు ప్రజల ఖర్చే.రోజువారీ వినియోగ వస్తువులపై పన్నులు వేసి, ప్రజల రక్తాన్ని పీల్చే జీఎస్టీ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కార్పొరేట్‌ లాభాలపై ప్రగతిశీల పన్నుల మాట ఎక్కడా లేదు. ఇది స్పష్టమైన వర్గ పక్షపాతం. కార్పొరేట్‌ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. పన్ను రాయితీలు, మినహాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటిసారి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు కార్పొరేట్‌ పన్నులను మించటం ఈ బడ్జెట్‌ వర్గ స్వభావాన్ని బహిర్గతం చేస్తోంది. అలాగే సెమి కండక్టర్‌ పరిశ్రమ, రేర్‌ ఎర్త్‌ కారిడార్లు, మాగెట్‌ మిషన్లు- ఈ బడ్జెట్‌లో ఇవన్నీ ”జాతీయ అవసరం”గా చూపించారు. కానీ, వాస్తవంలో ఇవన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు భారీ రాయితీలతో అప్పగించే ప్రతిపాదనలే. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలోని రేర్‌ ఎర్త్‌ ప్రాంతాల్లో ఆదివాసీల నివానం, పర్యావరణ విధ్వంసంపై ఒక్క మాట లేదు. ప్రజా రంగ పరిశ్రమలు అభివృద్ధి చేయకుండా, ఖనిజ సంపదను ప్రయివేటు కంపెనీల చేతుల్లో పెట్టడమే ఈ బడ్జెట్‌ లక్ష్యం. జాతీయ సంపద కార్పొరేట్‌ లాభంగా మార్చడమే కనిపిస్తోంది.

బడ్జెట్‌ కార్మికుల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దం పాటించింది. కొత్త లేబర్‌కోడ్స్‌ అమలుకు అనుగుణంగా వేతనాలు పెంచే అంశం గానీ, శాశ్వత ఉపాధి (పర్మనెన్సీ), ఉద్యోగ భద్రతపై గానీ ఎలాంటి ప్రస్తావన లేదు. ”ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌” పేరుతో కార్మిక హక్కులను తొలగించి, కాంట్రాక్ట్‌, క్యాజువల్‌, గిగ్‌ ఉపాధిని సాధారణం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కనీస వేతనాలపై హామీ లేదు. పనిగంటల పరిమితిపై స్పష్టత లేదు. యూనియన్‌ హక్కులపై ఒక్క మాట లేదు. అంటే, ఈ బడ్జెట్‌లో కార్మికుడు ఒక ఖర్చు అంశం మాత్రమే, హక్కులున్న పౌరుడు కాదు. సామాజిక న్యాయమనే పదమే మోడీ ప్రభుత్వానికి జెర్రులు పాకినట్టు అవుతున్నది. ఇంకా బ్యాంకింగ్‌ రంగానికి ప్రత్యేక కమిటీ వేస్తామన్న ప్రకటన వినిపించింది. కానీ, దీని అర్థం కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయడం కాదు, ఉన్న బ్యాంకలను తగ్గించడం. ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేయడం బదులు, వాటిని ప్రయివేటు బ్యాంకులతో పోటీపడేలా చేసి, చివరకు ప్రయివేటీకరణకు సిద్ధం చేయడమే ఈ విధానం.

ప్రయాణం ‘దూరం’, హామీలేని ‘ఉపాధి’
మోడీకి ముందు రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ఉండేది. అది ప్రజా రవాణా అవసరాలను కేంద్రంగా పెట్టుకుని రూపొందించబడేది. ఇప్పుడు దాన్ని జనరల్‌ బడ్జెట్‌లో కలిపేశారు. ఫలితం, హైస్పీడ్‌, హైటెక్‌ రైళ్లు తప్ప, సామాన్య ప్రజల ప్రయాణానికి అవసరమైన ప్యాసింజర్‌ రైళ్లు, జనరల్‌ కంపార్టుమెంట్ల పెంపుపై ఎలాంటి ప్రస్తావన లేదు.నేటి రైల్వే విధానం ఎలిటిఫికేషన్‌కు నిదర్శనం. సాధారణ ప్రయాణికుడికి రైలు ప్రయాణం మరింత ఖరీదవుతోంది, అసౌకర్యంగా మారుతోంది. ఇది ప్రజా సేవకాదు, లాభాల కోసం నడిచే వ్యాపారంగా రైల్వేను మార్చే ప్రయత్నం. దేశంలో ఉపాధి ఎక్కువగా ప్రయివేటు రంగంలోనే ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లపై ఈ బడ్జెట్‌ పూర్తిగా మౌనం పాటించింది. సామాజిక న్యాయం అన్న భావన ఈ ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో ఎక్కడా కనిపించదు. మాటల్లో ”సబ్‌కా సాథ్‌”, విధానాల్లో ”కొద్ది మందికే సౌకర్యం”. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఆధారం లేదు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధ హామీపై ఒక్క మాట లేదు. ఎరువుల సబ్సిడీ తగ్గింపు, వ్యవసాయ పెట్టుబడుల స్తబ్ధత రైతులను మరింత అప్పుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది.

వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశ ఈ బడ్జెట్‌లో కనిపించదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు లేకుండా ఉత్పత్తి పెరుగుతుందని ఊహించడం మోసమే. భూమిలేని పేదలకు భూ పంపిణీ, గ్రామీణ ఉపాధి, కనీస వేతనాల పెంపు వంటి చర్యల ద్వారానే డిమాండ్‌ పెరుగుతుంది. కానీ ఈ బడ్జెట్‌లో అలాంటి దిశ కనిపించదు. గ్రామీణ పేదలకు జీవనాధారమైన ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోంది. 125 పనిదినాలు ఇస్తామని చెప్పి రూ.95వేల కోట్లు మాత్రమే కేటాయించడం పచ్చి మోసం. పాత బకాయిలే వేల కోట్ల రూపాయలుగా ఉన్న పరిస్థితిలో, ఈ నిధులు కొత్త పనులకు ఏమాత్రం సరిపోవు. నిజంగా ప్రభుత్వం చెప్పిన రోజులు పని ఇవ్వాలంటే కనీసం మూడు లక్షల కోట్లు అవసరం.పరిమిత వనరులతో కూడా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్‌ రూపొందించడం సాధ్యమేనని వామపక్ష కేరళ ప్రభుత్వం చూపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని జంటగా ముందుకు తీసుకెళ్తోంది. కేంద్ర బడ్జెట్‌ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కార్పొరేట్‌ లాభాలను కేంద్రంగా చేసుకుంది.

ఏపీ,తెలంగాణలపై నిర్లక్ష్యం
ఏపీ విషయంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపే ప్రస్తావన లేదు. సొంత మైనింగ్‌ హక్కులు, పోలవరం నిర్వాసితుల సమస్యలు పూర్తిగా విస్మరించబడ్డాయి. తెలంగాణకు హామీ ఇచ్చిన స్టీల్‌ ఫ్యాక్టరీ, జాతీయ ప్రాజెక్టులపై బడ్జెట్‌ పూర్తిగా మౌనం పాటించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ బడ్జెట్‌ అసమానతలను తగ్గించదు, మరింత బలపరుస్తుంది. ప్రజల జీవితాలను తేలిక చేయదు, మరింత భారంగా మారుస్తుంది. ఇది ప్రజల బడ్జెట్‌ కాదు, ప్రజలపై భారాన్ని మోపే ఆర్థిక పత్రం. మరీ, ఈ బడ్జెట్‌కు ప్రత్యామ్నాయం లేదా అంటే ఉంది.కార్పొరేట్లపై అధిక పన్నులు విధించాలి. ప్రయివేటు హాస్పిటళ్లు, ప్రయివేటు విద్యాసంస్థలు, గ్రామీణ ధనిక వర్గంపై పన్నులు పెంచాలి. ఆ డబ్బును ప్రజా ఆరోగ్యం, ప్రజా విద్య, గ్రామీణ ఉపాధి, వ్యవసాయం మీద ఖర్చు చేయాలి. మొత్తంగా చూస్తే ఇది సామాన్యుల బడ్జెట్‌ కాదు. కార్పొరేట్‌ అనుకూల బడ్జెట్‌. అసమానతలను పెంచే ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యతే ఏకైక మార్గం. ఈ బడ్జెట్‌ను ప్రశ్నించడం, తిరస్కరించడం, ప్రత్యామ్నాయాన్ని నిర్మించడం, అదే నేటి రాజకీయ కర్తవ్యం.

బి.వెంకట్‌
9490098045

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -