ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో మహిళలను పట్టించుకోలేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి విమర్శించారు. సోమవారం ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా, శిశుఅభివద్ధి శాఖ బడ్జెట్ను మొత్తం వ్యయంలో 0.53 శాతం నుంచి 0.05 శాతానికి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ మహిళలు దుర్భర స్థితిగతులను ఎదుర్కొనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తప్పుపట్టారు. జెండర్ బడ్జెట్ అంచనాల ప్రకారం, జీడీపీలో వాటా నిజ విలువల్లో 1.61 శాతం నుంచి 1.38 శాతానికి పడిపోయిందని తెలిపారు. జెండర్ బడ్జెట్లో భాగం-ఎ లోని వంద శాతం మహిళా కేంద్రిత పథకాలు జీడీపీలో కేవలం 0.30 శాతం, భాగం-బి, సిలలో మహిళల వాటా 30 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఐదుసార్లు మహిళలంటూ ప్రస్తావించి, గిరిజనులు, యువత, పేదలు, మహిళలు కలిసి పురోగమిస్తారని చెప్పిన మాటలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతిఫలించలేదని విమర్శించారు. మహిళల హాస్టళ్లు, ఎస్టిఇఎమ్ రంగాల్లో మహిళలు, మహిళా వ్యాపారాల గురించి ప్రస్తావించారే తప్ప సరైన నిధులు కేటాయించలేదని తెలిపారు.
సంబల్, బేటీ బచావో, వన్ స్టాప్ సెంటర్, నారి అదాలత్, మహిళల హెల్ప్లైన్ వంటి పథకాల ఖర్చులను రూ.629 కోట్ల నుంచి రూ.627 కోట్లకు తగ్గించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార సబ్సిడీలో కోతలతో రైతులపై భారంతో పాటు వ్యవసాయరంగంపై ఎక్కువగా ఆధారపడే మహిళలపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీసీ (ఆశావర్కర్లు), మహిళలకు ఉపాధి కల్పించే ఇతర పథకాల్లో కూడా ఎలాంటి పెరుగుదల లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లఖ్ పతి దీదీ పథకంతో మహిళల అప్పులు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. మహిళల్లో సాధారణంగా కనిపించే రక్తహీనత సమస్య నియంత్రణకు సరైన చర్యలు ప్రకటించలేదనీ, ఆరోగ్య భారం తగ్గించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. మహిళల దీర్ఘకాలిక డిమాండ్లను బడ్జెట్ నిర్లక్ష్యం చేసిందనీ, మహిళా వ్యతిరేక బడ్జెట్ పై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
మహిళలను పట్టించుకోని కేంద్ర బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



