- Advertisement -
- హుస్నాబాద్ లో ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్
- నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
- హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని, ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లోని 1, 11, 12, 13 వార్డులలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హుస్నాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. శంకుస్థాపనలు తప్ప ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదన్నారు. బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయించిన ఘనత మాదేనని ఓటర్లకు చెప్పారు.
- అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్న కేసీఆర్ సార్ మళ్లీ రావాలంటే బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్న ఇప్పటివరకు పింఛన్లు పెంచలేదన్నారు. వికలాంగులు, వృద్ధుల పింఛన్లు ఎట్లున్నవి అట్లనే ఉన్నాయని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు, వృద్ధులు వికలాంగులు, మహిళల సమస్యలు తీరాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
- ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -



