నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) ఖాళీ సమయంలో ఎల్లగిరిలో ఉన్న కోళ్ల ఫారం షెడ్లో పనికి వెళ్తూ ఉండేవాడు. ఈ నెల 3వ తేదీ మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో విధులకు వెళ్లిన రవి 4వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకుని పొరపాటున అక్కడే ఉన్న “సర్మోలిన్” అనే కెమికల్ ద్రావణం తాగినట్లు సమాచారం. కొద్దిసేపటికే కడుపులో తీవ్ర మంట ఉందని చెప్పడంతో, అక్కడున్న సహచరులు అతడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో రవి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి అన్న కొడుకు గుడ్డేటి లవ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కెమికల్ ఎలా అందుబాటులో ఉంది, ప్రమాదవశాత్తే జరిగిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మాల్ తెలిపారు.
నీళ్లు అనుకోని కెమికల్ సేవించి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



