– నేటి నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్
– తొలి రోజు బరిలో ఆరు జట్లు
– నేడు యుఎస్ఏతో ఆతిథ్య భారత్ ఢీ
నవతెలంగాణ-ముంబయి : ఆధునిక క్రికెట్లో మరో మెగా ఈవెంట్కు రంగం సిద్ధమైంది. తొలిసారి 20 జట్లు పోటీపడుతున్న వేళ 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేటి ఆరంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచకప్లో తొలి రోజు మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. కొలంబోలో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తలపడనుండగా.. ఈడెన్గార్డెన్స్లో స్కాట్లాండ్తో వెస్టిండీస్ తలపడనుంది. ముంబయి వాంఖడెలో జరుగనున్న మ్యాచ్లో ఆతిథ్య భారత్, యుఎస్ఏ (అమెరికా) ఢకొీట్టనున్నాయి. గ్రూప్ దశలో 20 జట్లు.. నాలుగు గ్రూపుల్లో ఐదేసి జట్ల చొప్పున తలపడతాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ఎయిట్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ఎయిట్లో ఎనిమిది జట్లు రెండు గ్రూప్లుగా ఆడతాయి. ప్రతి గ్రూప్లో ఉత్తమ రెండు జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మార్చి 8న ఫైనల్ జరుగుతుంది.
భారత్కు ఎదురుందా? :
భారత్, అమెరికా వరుసగా రెండోసారి ప్రపంచకప్లో ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్నాయి. 2024 ప్రపంచకప్లోనూ యుఎస్ఏ, భారత్ ఒకే గ్రూప్లో నిలిచాయి. డ్రాప్ఇన్ పిచ్లపై భారత్ను ఆతిథ్య అమెరికా ఇరకాటంలో పడేసినా.. సూర్యకుమార్ షోతో భారత్ మెరుపు విజయం సాధించింది. గతంలో ముంబయి తరఫున సూర్యకుమార్తో కలిసి ఆడిన హర్మీత్సింగ్ నేడు అమెరికా కెప్టెన్గా భారత్కు సవాల్ విసురుతున్నాడు. అమెరికా జట్టులో ముగ్గురు పాకిస్తాన్, ఐదుగురు భారత్లో జన్మించిన ఆటగాళ్లు ఉన్నారు. ఫామ్ కోల్పోవటంతో సంజు శాంసన్ బెంచ్కు పరిమితం కానుండగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా రానున్నాడు. హర్షిత్ రానాకు గాయంతో అర్ష్దీప్ సింగ్ తుది జట్టులో నిలువనున్నాడు. భారత్,అమెరికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం.
ధనాధన్కు వేళాయే
- Advertisement -
- Advertisement -



