Sunday, February 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహెచ్‌ఎంలకు యాప్‌ కష్టాలు

హెచ్‌ఎంలకు యాప్‌ కష్టాలు

- Advertisement -

సాంకేతిక సమస్యలతో సతమతం
పిల్లలు తినకున్నా గుడ్డుకు బిల్లు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్‌)కు సంబంధించి ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం) యాప్‌ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం పది గంటల్లోపు యాప్‌లో విద్యార్థుల వివరాలను పొందుపర్చాలి. నిబంధనలను పాటించకుంటే చర్యలుంటాయని అధికారులు భయాందోళనలకు గురిచేస్తున్నారు. కొన్ని సార్లు సాంకేతిక సమస్యలు, యాప్‌ సర్వర్‌ ఇబ్బందుల వల్ల పనిచేయని కారణంగా వివరాలు నమోదు చేయకుంటే ఆ రోజుకు సంబంధించిన బిల్లు మళ్లీ చేయడానికి వీలు కాదు. ఆ బిల్లు మంజూరుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని హెచ్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. గతంలో పాఠశాలల నుంచి ఎంఆర్‌సీకి పంపిన వివరాల ఆధారంగా మధ్యాహ్న భోజన పథకం బిల్లులు తయారయ్యేవి. ఆ నెలలో విద్యార్థులకు వడ్డించిన కోడిగుడ్ల వివరాలను కూడా పొందుపరిచే వారు.

గతేడాది నవంబర్‌ నుంచి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ యాప్‌లో మధ్యాహ్న భోజన పథకం వివరాలను పొందుపరచాలని ఆదేశించింది. వాటి ఆధారంగానే ఆన్‌లైన్‌లో బిల్లులు తయారవుతు న్నాయి. అందులో ఎంతమంది మధ్యాహ్న భోజనం తింటున్నారు అనే సమాచారం తప్ప ఆరోజు ఎన్ని కోడిగుడ్లు వాడుతున్నారు అనే సమాచారం పొందుపరిచే అవకాశమే లేదు. విద్యార్థులు కోడిగుడ్లు తినకున్నా వాటికి సంబంధించిన బిల్లు తయారవుతుంది. దీంతో బిల్లుల్లో చాలా తేడాలు వస్తున్నాయని హెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, మిగతా మూడు రోజులు రాగి జావా అందించాలి. ఈ ఏడాది రాగి జావా సరిగ్గా సరఫరా కాలేదనీ, చాలాసార్లు పిల్లలకు అందడం లేదని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.

గుడ్డు ధర పెరిగితే భారమే
కోడి గుడ్డు ధర ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు భారంగా మారుతుంది. దీంతో ప్రభుత్వం చెల్లించే డబ్బులకు వచ్చే కోడుగుడ్లను విద్యార్థులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. బడ్జెట్‌కు మించి అయితే గుడ్డు పెట్టడానికి వారు నిరాకరిస్తారు. శ్రావణమాసం, కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు, హనుమాన్‌ దీక్షలు, వినాయక నవరాత్రులు వంటి సందర్భాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తారు కానీ కోడిగుడ్డు తినడానికి నిరాకరిస్తారు. పాఠశాలల నుంచి తిన్న కోడిగుడ్ల సంఖ్యను మాత్రమే ఎంఆర్‌సీకి పంపించబడేది.

మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తాయి. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పాఠశాలలకు సరఫరా చేస్తుంది. దాన్ని మధ్యాహ్నం భోజన కార్మికులు వండి పిల్లలకు వడ్డిస్తారు. కూర కోసం ఐదో తరగతి వరకు ప్రతి విద్యార్థికి రూ.6.78 పైసలు, ఆరు, ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించి ప్రతి విద్యార్థికి రూ.10.17 పైసలు ప్రభుత్వాలు ఇస్తాయి. తొమ్మిది, పది తరగతుల కోసం ప్రతి విద్యార్థికి రూ.13.17 పైసలు (కోడిగుడ్డు ధర కలుపుకుని) చెల్లిస్తాయి. ఎనిమిదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు కోడిగుడ్డు కోసం ప్రభుత్వం అదనంగా రూ.ఆరు చెల్లిస్తుంది. విద్యార్థులకు వారంలో మూడు కోడిగుడ్లు అందించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -