నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఎస్బిఐ జుక్కల్ బ్రాంచ్ మేనేజర్ సదానందం ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది మంగళవారం బస్వాపూర్ గ్రామంలో గ్రామస్తులకు కేవైసీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖాతాదారులు తప్పకుండా బ్యాంకు ఖాతాకు కేవైసీ చేయించుకోవాలని సూచించారు. కేవైసీ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన పథకాల డబ్బులు నేరుగా ఖాతాలోనే జమ అవుతాయని తెలిపారు. కేవైసీ చేసుకోకపోవడం వలన ఖాతాదారులకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
అందుకే ఆన్లైన్ సెంటర్లో కానీ నేరుగా బ్యాంకు సిబ్బందిని కలిసి ఆధార్ కార్డు చూపించి తన ఖాతాకు కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము ప్రతీ పథకానికి ఆధార్ లింకు చేస్తోందని, కేవైసీ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క లబ్ధిదారుని పూర్తి సమాచారం బ్యాంకు వారికి తెలుస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల రుణం పొందుతున్న సమయంలో సభ్యులకు కేవైసీ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. బ్యాంకు వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవైసీ తప్పనిసరి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ జుక్కల్ బ్రాంచ్ మేనేజర్ సదానందం, బ్యాంకు సిబ్బంది, గ్రామ పెద్దలు , గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ , జిపి పాలకవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి భరద్వాజ్, సురేష్ గొండ, మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



