Sunday, June 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ..గద్దె దిగు

మోడీ..గద్దె దిగు

- Advertisement -

రాహుల్‌‌ను ప్రధాని చేసి అనుమతులు తెచ్చుకుంటాం
అభివృద్ధి నిరోధకులు 
బీఆర్ఎస్ నేతలు
పాల‌మూరు రంగారెడ్డికి 
జాతీయ హోదా తెస్తా
ద‌శాబ్దకాలంలో శ‌తాబ్దానికి 
స‌రిపోయే విధ్వంసం చేశారు


కోహెడ అంతర్జాతీయ సమీకృత 
పండ్ల మార్కెట్‌, రిజిస్ర్టేషన్‌ భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్‌‌రెడ్డి
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
​మోడీ గ‌ద్దె దిగితే రాహుల్ గాంధీ ప్ర‌ధానిని చేసి, రాష్ట్రానికి అవసరమైన అనుమతులన్నీ తెచ్చుకుంటామని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి అన్నారు. శనివారంనాడాయన కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌, రిజిస్ర్టేషన్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్‌ ‌ప్రధాని అయితే రాష్ర్టంలో పండిన ధాన్యం ప్ర‌తి గింజను కేంద్రంతో కొనిపిస్తానని చెప్పారు. మెట్రో విస్త‌ర‌ణ‌కు అనుమ‌తులు, పాల‌మూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తామన్నారు. కేంద్రం ఈనెల 15లోపు 75 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొన్న త‌ర్వాత దాని సంగతి ఏంటో చూస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్, వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ఎలా నిధులు ఇవ్వ‌రో చూస్తానన్నారు. కేంద్రంలో ప్ర‌భుత్వం ఉంద‌ని భ‌య‌పెట్టాల‌ని చూస్తే భ‌య‌ప‌డేది లేదనీ, కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డిని పోలిమేర‌లు కూడా దాట‌నివ్వమని హెచ్చరించారు. బీజేపీలోని గుండు ,అర‌గుండు ఏమోమో మాట్లాడుతున్నారనీ, అందరికీ సమాధానం చెప్తానని అన్నారు. కేంద్రంతో స‌త్సంసంబంధాలు పెట్టుకుని రావాల్సిన నిధులు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామనీ, ఈ దశలో ఫాంహౌజ్‌ ‌నాయకుడు కాళ్లలో కట్టెలు పెట్టె పనులు చేస్తున్నాడని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా రైతులు క‌ష్ట‌ప‌డి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు పండ్లు ,కూర‌గాయ‌లు, పాలు అందించేవారనీ, రియ‌ల్ ఎస్టేట్ పెరిగి ఇప్పుడు వ్య‌వ‌సాయం కుంటుప‌డిందని చెప్పారు. హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ న‌గ‌రంగా మారిందనీ, ఇప్పుడు న‌గ‌ర ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చ‌లేకపోతున్నామన్నారు. అందుకే 240 ఎకరాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేశామన్నారు. మన రైతులు వ‌రి, మొక్క జొన్న‌, ప‌త్తి, మిర్చి లాంటి పంట‌ల‌ను మాత్ర‌మే పండిస్తున్నారనీ, మోదీ ప్ర‌భుత్వ హ‌యాంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పారు.బీఆర్ఎస్ నాయ‌కులు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ని ర‌ద్దు చేస్తామంటున్నారనీ, రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు, వ‌రంగ‌ల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, తుమ్మిడిహ‌ట్టిని నిర్మించొద్దని అంటున్నారని తెలిపారు. రాష్ర్టంలో ఎలాంటి అభివృద్ధి చేస్తామం టున్నా ఇలాంటి అష్ట‌ద‌రిద్రులు రోడ్ల‌పైకి వ‌చ్చి ధ‌ర్నాలు చేస్తున్నారని విమర్శించారు. డిసెంబ‌ర్ నుంచే ఫ్రూట్ మార్కెట్ లో కార్య‌క‌లాపాలు ప్రారంభం కావాలనీ, రెండేళ్ల‌లో ఫ్రూట్ మార్కెట్. నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. దీనికోసం నిధుల‌ను గ్రీన్ ఛాన‌ల్ లో ఇస్తామన్నారు. కోట్లాది రూపాయ‌ల రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నా స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో క‌నీస సౌక‌ర్యాలు కూడా లేవనీ, ఆ శాఖ ద్వారా ఏటా రూ. 15 వేల కోట్ల ఆదాయం వ‌స్తోందని చెప్పారు. ఏ ఊళ్లో వ‌డ్లు పండినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పుకున్నారనీ, ఇప్పుడు అక్కడి నుంచి చుక్క నీరు రాకున్నా రికార్డు స్థాయిలో వ‌రి పండించామని తెలిపారు. ‘కూలేశ్వరం’ కట్టిన వాళ్లకు అదే గోదావరిలో వాళ్ల‌కు తద్దిన్నం పెట్టాలా లేదా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పైన హ‌రీశ్‌‌రావు చాలా స‌ల‌హాలు ఇస్తున్నాడనీ, ఆ స‌ల‌హాల వల్లే కాళేశ్వ‌రం కూలేశ్వ‌రం అయ్యిందని ఎద్దేవా చేశారు. మోడీ, కేసీఆర్‌‌లు ద‌శాబ్ద కాలంలో శ‌తాబ్దానికి స‌రిపోయే విధ్వంసం చేశారని విమర్శించారు. తాను ఫామ్ హౌస్ లో ప‌డుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉన్న మోడీతోనైనా కోట్లాడుతాననీ, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ అడ్డ‌గోలుగా మాట్లాడుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -