టెలిగ్రామ్పై నిషేధం కేసులో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : కొంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారనే కారణంతో 15 కోట్ల మంది వినియోగదారుల హక్కులను మనం ఆపగలమా ? అని కేంద్ర ప్రభుత్వాన్ని 15 కోట్ల మంది హక్కులను ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. ప్రముఖ మేసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ విచారణలో హైకోర్టు ఈ ప్రశ్నను సంధించింది. తమపై నిషేధానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారించింది. ‘ఒకరిని రక్షించడానికి ఇంకొకరి హక్కును మీరు అడ్డుకోంటారా’ అని విచారణ సందర్భంగా జస్టిస్ కరియా ప్రశ్నించారు. అలాగే, కేంద్రం ఆరోపిస్తున్న పత్రాల లీక్ను నివారించడానికి రియల్-టైమ్ పర్యవేక్షణ వంటి తగిన చర్యలు తీసుకున్నారా.. అని టెలిగ్రామ్ కూడా జస్టిస్ కరియా ప్రశ్నించారు. టెలిగ్రామ్ తరఫున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపించారు. అభ్యంతరకరమైన పోస్టులను తొలగించాలని మాత్రమే కేంద్రం కోరగలదని, అంతేగానీ ప్లాట్ఫామ్పై వివక్ష పూరితంగా నిషేధం విధించకూడదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్ డిజైన్ భిన్నంగా ఉండటం వల్ల దర్యాప్తు నిర్వహించడం కష్టంగా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న తరువాత తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిఫారసుతో టెలిగ్రామ్పై ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని టెలిగ్రామ్ తో పాటు, ఈ రంగానికి నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అలాగా, మెటాలో రిలయన్స్ గ్రూప్నకు పాక్షిక వాటా ఉన్న కారణంగానే వాట్సాప్పై కేంద్రం నిషేధం విధించలేదని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఆరోపించారు.
15 కోట్ల మంది హక్కులను ఆపగలమా?
- Advertisement -
- Advertisement -



