నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి సౌకర్యవంతమైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘసేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చారు. బీబీపేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని 60 గ్రామపంచాయతీలకు కుర్చీలు, టేబుళ్లు అందజేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ గ్రామ సర్పంచి మట్ట శ్రీనివాస్, బిబిపేట మండల వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డ్ మెంబర్లు నరసింహ చారి, వంశి, తుజాల్పూర్ మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్, అశోక్ గౌడ్, జనగామ గ్రామానికి చెందిన బోధ సాయికుమార్, కప్పెర వెంకటరామిరెడ్డి, చాట్ల బాబు, చింతల రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



