నీట్ రీ టెస్ట్ లో బయటపడిన ఎన్టీఏ నిర్వాకం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పరీక్షలో మళ్లీ తీవ్రమైన లోపం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణలో బయోమెట్రిక్ కార్యకలాపాల బాధ్యతను ఎన్టీఏ బ్లాక్లిస్ట్ కంపెనీకి అప్పగించింది. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి నీట్ పరీక్ష నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో 22 లక్షలకు పైగా విద్యార్థులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ) భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ పునః పరీక్షను నిర్వహించాయి. ఈ పరీక్షలో భాగంగా ‘ఇన్నోవేటివ్ వ్యూ’ అనే కంపెనీ విద్యార్థుల బయోమెట్రిక్ వ్యవస్థలకు బాధ్యత వహించింది. అయితే ఈ పరీక్షలో అవకతవకల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు ఆ కంపెనీని బ్లాక్లిస్ట్ చేశాయి. అయినప్పటికీ, దేశంలోనే ఇంతటి ముఖ్యమైన పరీక్షను నిర్వహించే అవకాశం ఈ కంపెనీకి ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. బీహార్లో నీట్ పరీక్ష రాసిన నకిలీ అభ్యర్థులు తొమ్మిది మందిని అరెస్టు చేసిన తరువాత ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.
అరెస్టు అయిన వారిలో ఇన్నోవేటివ్ వ్యూ కంపెనీ కింద పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులే నకిలీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి మార్గం సుగమం చేశారు. ఈ ఘటనలో మొత్తం 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే విద్యార్థుల బయోమెట్రిక్ ధృవీకరణ కాంట్రాక్టును ఇండ్సిల్ అనే కంపెనీకి ఎన్టీఏ అప్పగించింది. ఇండ్సిల్ ఈ బాధ్యతను ఇన్నోవేటివ్ వ్యూకు బదిలీ చేసింది. కాంట్రాక్టును ఇండ్సిల్కు బదిలీ చేసినప్పుడు ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టంగా చెప్పలేదు. పునఃపరీక్ష ను ప్రధానమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గత నెలలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే బీహార్ పోలీసులు, ఎన్టీఎకు ఒక రహస్య ఈ మెయిల్ అందిన తరువాతే ఈ తీవ్రమైన లోపం గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.
మోసానికి పాల్పడ్డ ముఠాకు రూ.60 లక్షలు
‘సాల్వర్ గ్యాంగ్’గా పిలవబడే ఓ ముఠా, ఇన్నోవేటివ్ వ్యూ ఉద్యోగులతో కలిసి పరీక్షలో నకిలీ విద్యార్థి పేరుతో మోసానికి పాల్పడింది. ఈ ముఠా ఒక విద్యార్థి పేరుతో నకిలీ విద్యార్థిగా నటించి ఆయన నుంచి రూ. 60 లక్షల వరకు తీసుకుంది. ఈ ముఠాకు సూత్రధారిగా భావిస్తున్న పాట్నా మెడికల్ కాలేజీ మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి అశ్విని కుమార్ను అరెస్టు చేశారు. ఈయన మయాంక్ కశ్యప్ అనే మారుపేరుతో చెలామణి అవుతున్నాడు. వసూలు చేసిన రూ.60 లక్షలలో రూ.25 లక్షలు అశ్విని కుమార్ ఒక్కడికే అందినట్టు సమాచారం. బయోమెట్రిక్ ఉద్యోగిగా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన అశ్వినికుమార్ ఈ మోసాన్ని సమన్వయం చేస్తున్నాడు. నకిలీ గుర్తింపును నివారించడానికి, జాతీయ వైద్య కమిషన్ పరీక్ష రోజున వైద్య విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా నిరోధించింది. అయితే, పరీక్ష రోజున అశ్విని హాజరు తరగతిలో నమోదైనట్లు కూడా వెల్లడైంది. ఈ ముఠా చేస్తున్న మోసంలో పరీక్షా కేంద్రాలకు 100-150 మీటర్ల పరిధిలో విద్యార్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తున్నారు.
బ్లాక్ లిస్టు కంపెనీకి బయోమెట్రిక్
- Advertisement -
- Advertisement -



