పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలి :
ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలో
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవు తాయని చెప్పారు. ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి నెలకు రూ.18 వేలు కనీస వేతనం చెల్లించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్లోని నూర్జహాన్ నగర్లో తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్కుమార్ ఆవిష్కరించారు. అనంతరం రాజ్కుమార్, ఎం నగేశ్, అంజి, చంద్రలీల అధ్యక్షవర్గంగా మహాసభలు ప్రారంభమ య్యాయి. నూర్జహాన్ చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. నగేశ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఒకటని చెప్పారు. పథకాలు అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు.
స్కీం వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలనీ, వారిని రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ పోరాటం చేస్తున్నదని వివరించారు. దేశంలో ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రోజుకు రూ.175 చొప్పున నెలకు రూ.4,550 సరిపోతాయని చెప్తున్నదని విమ ర్శించారు. అందులో భాగంగానే ఐకేపీల జీతం రూ.ఐదు వేలు చెల్లిస్తున్నారని అన్నారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వకపోయినా రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి శ్రమను గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దాని ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు రూ.14 వేలు, కొంత నైపుణ్యం ఉంటే రూ.15 వేలు, సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.16 వేలు, నైపుణ్యం ఉన్న వారికి రూ.18 వేలు ఇవ్వాలని నిర్ణయించిందని గుర్తు చేశారు.
ఈ జీవో ప్రకారమైనా ఐకేపీ వీవోఏలు ట్యాబ్లలో పనిచేస్తారనీ, నైపుణ్యం ఉన్న వారు అయినందున రూ.18 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అది కూడా ఇవ్వడం లేదన్నారు. అందుకే పాలకుల విధానాలను ప్రశ్నించాలనీ, ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొట్లాడకుండా సమస్యలు పరిష్కారం కాబోవని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి నిరసనగా వచ్చేనెల ఒకటిన గ్రామ పంచాయతీల్లో చేపట్టే ధర్నాల్లో భాగస్వా ములు కావాలని కోరారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో సామ్రాజ్యవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలని కోరుతూ ఆగస్టు పదిన చేపట్టే జైల్భరో, ఇతర నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడాలనీ, సీఐటీయూ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు జె వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, కోశాధికారి సుమలత, ఆఫీస్ బేరర్ దుర్గన్న తదితరులు పాల్గొన్నారు.



