Thursday, February 26, 2026
E-PAPER
Homeఖమ్మంరోడ్డు భద్రతా నియమాలను పాటించండి 

రోడ్డు భద్రతా నియమాలను పాటించండి 

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
రోడ్డు భద్రతా నియమాలను పాటించండి, సురక్షితంగా ప్రయాణం చేయండి, సంతోషంగా జీవించండి, మన ప్రాణాలు పోగొట్టుకోవద్దు, ఎదుటివారి ప్రాణాలు పోగొట్టవద్దని వైరా ఏసిపి సాదుల సారంగపాణి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై పొదిలి వెంకన్న అధ్యక్షతన రోడ్డు భద్రత అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు.ఈ సదస్సులో సారంగపాణి మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు వైరా సబ్ డివిజన్ వ్యాప్తంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలతో బయటకు బయలుదేరిన ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వెళ్ళటం వలన తిరిగి ఇంటికి సురక్షితంగా రావచ్చు అన్నారు.

పోలీసులు అంటే కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రజల భద్రత గురించి కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నేరం జరగకుండా ముందుగానే పోలీసులు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి అన్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా, మద్యం సేవించకుండా నియమాలను పాటిస్తూ వెళ్తే తిరిగి ఇంటికి సురీక్షితంగా వస్తామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా ప్రయాణం చేయండి, సంతోషంగా జీవించండి అనే నినాదంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటారు వాహనాల చట్టం, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన జరిగే మృతుల సంఖ్య అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. చాలామంది హత్య సంఘటనపై స్పందించిన విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం లేదని, ఇది ఒక సాధారణ సంఘటనగా భావిస్తున్నారన్నారు.

రోడ్డు ప్రమాదాలు వలన స్పందించే విధానం వేగంగా ఉండాలన్నారు. ప్రజా సంక్షేమం కోసమే రోడ్డు నిబంధనలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్, హెల్మెట్ వంటివి ఉంటే వాహనదారుడు సురక్షితంగా ఇంటికి వస్తారన్నారు. ఎట్టి పరిస్థితులలోను సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ఒకప్పుడు రోడ్డు ప్రమాదం నిందితులకు రెండు సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఉండేదని, కానీ ఇప్పుడు 10 సంవత్సరాలకు పెంచారన్నారు. తొందరగా వెళ్లాలని ఆలోచనలు మనసులో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తారని, ఇటువంటి సమయంలోనే అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను అనుమతించేది స్పష్టం చేశారు.

ప్రధానంగా ఆటోలలో సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లను నమ్ముకొని అనేకమంది ప్రయాణికులు ఎక్కుతున్నారని వారిని ప్రాణాలతో సురక్షితంగా తమ గమ్యాలకు చేర్చవలసిన బాధ్యత ఆటో డ్రైవర్ల పై ఉందన్నారు. త్వరలోనే తాను స్వయంగా బోనకల్ మండల కేంద్రంలో వాహనాలతానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు. మధిర రూరల్ సీఐ దొంగరి మధు, బీపీ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, మరీదు బరకయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు తోట రామాంజనేయులు, యంగల ఆనందరావు, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -