తప్పు చేయకపోతే మంత్రులు ఎందుకు రాలేదు
ముఖ్యమంత్రి కుటుంబసభ్యులే కబ్జాదారులు
అండగా ఉంటాం..అధైర్యపడకండి
ఖమ్మం భూదాన్ నిర్వాసితులకు కేటీఆర్ భరోసా
నవతెలంగాణ-గాంధీచౌక్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాదని, కుంభకోణాల రాజ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు ఇప్పటికే కోట్లాది రూపాయల పలు కుంభకో ణాలకు తమ పార్టీ వెలుగులోకి తెచ్చిందని తెలిపారు. పేదల పట్ల దమనకాండ చేస్తున్న ప్రభుత్వం పెద్దలకు మాత్రం ఊడిగంచేస్తున్నదని మండిపడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితుల ఇండ్లను పరిశీలించేందుకు ఖమ్మంనగరానికి గురువారం ఆయన వచ్చారు.
సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. హైదారాబాద్లో కూడా వికలాంగుల ఇండ్లను కూడా కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులే కబ్జాదారులు అని, రేవంత్ ప్రభుత్వం వారికి కొమ్ము కాస్తూ పేదలను మాత్రం వీధుల పాలు చేస్తుందని అన్నారు. గాంధీనే ఆదర్శమని చెప్పుకునే రేవంత్రెడ్డి పేదల వుసురు పోసుకుంటూ గాడ్సేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం భూదాన్ నిర్వాసితుల విషయంలో తప్పు చేయకపోతే మంత్రులు సంఘటనా స్థలాన్ని ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు.
అసలు భూదాన్ భూమి అంటేనే దానంగా ఇచ్చే భూమి అన్నారు. అటువంటి భూమిలో పేదల ఇండ్లు కూల్చడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మన ప్రభుత్వంలో ఇండ్లు నిర్మించి గృహ ప్రవేశం చేయించే బాధ్యత తనదేనన్నారు. అప్పటి వరకు బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామన్నారు. బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, పార్టీ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు, సీనియర్ నాయకులు గుండాల కృష్ణ, నగర అధ్యక్షులు పగడాల నాగరాజులతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.



