-కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో రాష్ట్రవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం
-90 రోజుల ప్రచారంలో భాగంగా 4 లక్షల బాలికలకు ఉచిత సింగిల్ డోస్ టీకా లక్ష్యం..
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
రాష్ట్రంలో బాలికల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును సురక్షితం చేయవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర నరసింహ అన్నారు. శనివారం హైదరాబాద్లోని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో రాష్ట్రవ్యాప్తంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాకరణ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కలసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాజస్థాన్ అజ్మీర్ నుండి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా దేశవ్యాప్తంగా ప్రారంభించిన జాతీయ కార్యక్రమానికి అనుసంధానంగా నిర్వహించబడింది.
కార్యక్రమాన్ని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించి, జాతీయ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 4 లక్షల బాలికలకు 90 రోజుల వ్యవధిలో టీకాలు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ కార్యక్రమం రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు.
జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు మరియు కాలుష్యం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు 55 వేల నుండి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 10 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర క్యాన్సర్ పాలసీని రూపొందించిందని తెలిపారు. ములుగు, ఆదిలాబాద్ వంటి దూర ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ సేవలను విస్తరించడంతో పాటు ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ల ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించే చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్య మహిళ క్లినిక్ల ద్వారా విస్తృత పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.
క్యాన్సర్ను నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉందని, తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు 32 వేల కేసులు నమోదవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ క్యాన్సర్ 99.7 శాతం హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుందని, సమయానికి టీకా తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి హెచ్పీవీ టీకాకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) అనేది ఒక సాధారణ వైరస్, ఇది ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్కు కారణమవుతుందని, ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దీర్ఘకాలంలో గర్భాశయ ముఖద్వారం కణాలలో మార్పులు కలిగించి క్యాన్సర్కు దారితీస్తుందని ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల ఇది నిశ్శబ్దంగా వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలపై దృష్టి సారిస్తూ టీకాకరణ, స్క్రీనింగ్, మొబైల్ డయాగ్నస్టిక్ సేవలు మరియు ఆరోగ్య మహిళ క్లినిక్ల ద్వారా సేవలను బలోపేతం చేనున్నట్లు మంత్రి వివరించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 3వేల నుండి రూ. 4 వేల వరకు ఖర్చయ్యే హెచ్ పి వి టీకాను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. తొలి దశలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకా అందుబాటులో ఉంటుందని, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దేవ హర్షిణి, గాయత్రి దేవి, కావ్యశ్రీ, శ్రీలక్ష్మి, హారికలకు హెచ్పీవీ టీకాలు ఇవ్వగా, వారికి టీకాకరణ సర్టిఫికెట్లు అందజేశారు.అర్హత కలిగిన ప్రతి బాలిక టీకా తీసుకునేలా తల్లిదండ్రులు ముందుకు రావాలని మంత్రి కోరారు. బాలికల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును సురక్షితం చేయవచ్చని పేర్కొన్నారు. టీకా కేంద్రంలో పిల్లలతో మంత్రి మాట్లాడి, టీకా ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ డా. సంగీత సత్యనారాయణ, డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ ,తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ సూర్య శ్రీ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ఆర్ఎంఓ డాక్టర్ సాధన,, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ సాయిబాబా,వైద్యులు తదితరులు పాల్గొన్నారు.



