నవతెలంగాణ – పరకాల
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో నూతన భవనాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.
అలాగే, పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి పాఠశాలకు సరిపడా బెంచీలు మరియు శుద్ధమైన మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని ఆయన కోరారు. అనంతరం ఈ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, రాహుల్, శశి, రాజ్ కుమార్, సన్నీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



