సర్పంచ్ సోదరి కల్పనా దేవయ్య ఆధ్వర్యంలో నివాళులు
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంకుశపూర్ గ్రామపంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, అజాత శత్రువు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సోదారి కల్పనా దేవయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో శ్రీపాదరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆయన ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప నాయకుడని కొనియాడారు. రాజకీయ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, సరళత, ప్రజల పట్ల అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ కల్పనా దేవయ్య తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.



