నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సత్రోనిపల్లి తాండ నివాసి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ ను భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ లు తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ 1997 సంవత్సరము నుండి లంబాడి తండాల సమస్యల పట్ల, లంబాడి తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, బాల కార్మిక నిర్మూలన కోసం, జీవనోపాధి సరిగా లేక తాండాలలో పసిపిల్లలను విక్రయాలు జరుగుతున్న క్రమంలో పసి పిల్లలను విక్రయించరాదని అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారని వారు పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రచారం చేయడంలో అంబేద్కర్ జాతరలో కీలక పాత్ర పోషించారని, విద్య ద్వారానే బడుగు బలహీన వర్గాల జీవితాలలో మార్పు వస్తుందని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించారని, ప్రజా సమస్యల పట్ల ప్రజా ఉద్యమాలలో ఎంతో చాకచక్యంగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ విషయాలపై గత రెండు సంవత్సరాలుగా సర్వే నిర్వహించి 2026 సంవత్సరానికి గాను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు విస్లావత్ చందర్ నాయక్ ను ఎంపిక చేసినట్లు నల్ల రాధాకృష్ణ తెలిపారు.
జూలై 12న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. లంబాడి తాండలలో గల ప్రజల బ్రతుకులు మారాలంటే ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించాలని, విద్య ద్వారానే మన బ్రతుకులు మారుతాయని,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలలో పనిచేస్తున్న నన్ను గుర్తించి నేను అత్యధికంగా నమ్మే భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ వార్డుకు నన్ను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. ఈ అవార్డు ద్వారా తనకు బాధ్యతలు ఇంకా పెరిగాయని వారు అన్నారు. తనకు బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డుకు ఎంపిక చేసిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.



