– ఎంఈవో ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రతి ఉపాధ్యాయుడు వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేస్తేనే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించగలమని మండల విద్యాధికారి (ఎంఈవో) పి. ప్రసాదరావు అన్నారు. సోమవారం ఉదయం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యా ప్రమాణాల పరంగా అశ్వారావుపేట మండలాన్ని జిల్లాలో ముందువరుసలో నిలబెట్టడంలో ఉపాధ్యాయుల సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.
జిల్లా స్థాయి నుంచి వచ్చే ఆన్లైన్ నివేదికలను సకాలంలో పూర్తి చేయాలని, విద్యార్థుల అపార్ (ఏపపీపీఏఆర్) జనరేషన్, ఎంబీయూ (ఎంబీయూ) పెండింగ్ పనులను పూర్తిచేయాలని, పాఠ్యపుస్తకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, గ్రామ విద్యా రిజిస్టర్ను ఉన్నతీకరించాలని ఆదేశించారు. అలాగే “బడిబాట” కార్యక్రమంలో కృషి చేసి విద్యార్థుల సంఖ్యను పెంచిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అభినందించారు.
అశ్వారావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ, పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఏఎక్స్ఎల్ అమలు చేస్తున్న పాఠశాలల్లో 2, 3వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రి – ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
డిజిటల్ లెర్నింగ్ బోధనలో భాగంగా “అన్న – అక్క మెంటార్షిప్” కార్యక్రమానికి వచ్చే డిగ్రీ విద్యార్థులకు సహకరించాలని, 1వ తరగతి విద్యార్థులకు “విద్యా ప్రవేశ్” మాడ్యూల్ను సమర్థంగా వినియోగించాలని తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఖాన్ అకాడమీ పాఠ్యాంశాలపై శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, షాహీనా బేగం, కొండలరావు, వీరేశ్వరరావు,సీఆర్పీ లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



