నవతెలంగాణ – అశ్వారావుపేట
జూనోసిస్ డే పురస్కరించుకొని సోమవారం స్థానిక ప్రభుత్వ పశువైద్యశాల లో పశువైద్యాధికారి డాక్టర్ జీ.వినయ్ పర్యవేక్షణలో, అశ్వారావుపేట లయన్స్ క్లబ్ సహకారంతో పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, పెంపుడు జంతువులకు నిర్ణీత వ్యవధిలో తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించడం ద్వారా రేబీస్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అవసరమైన వ్యాక్సిన్లు పశువైద్యశాలలో అందుబాటులో ఉంటాయని, యజమానులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అశ్వారావుపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ లక్కినేని నరేంద్రబాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో జంతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు తమ క్లబ్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని, వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు అవసరమైన మందులు, ఇతర సదుపాయాల కల్పనలో తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు కోటగిరి మోహన్రావు, కొఠారి చలపతిరావు,దూపగుంట్ల దుర్గారావు,చీమకుర్తి వెంకటేశ్వరరావు, మేడవరపు శ్రీనివాసరావు, పశువైద్యశాల సిబ్బంది నాగేంద్ర, భవాని తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాక్సినేషన్ శిబిరానికి అశ్వారావుపేట పట్టణం నుంచి 100 కు పైగా వివిధ జాతుల పెంపుడు కుక్కలు తీసుకువచ్చారు. కుక్కలతో పాటు ఇతర పెంపుడు జంతువులకు కూడా అవసరమైన వ్యాక్సిన్లు వేశారు.



