గెలుపు వేటలో టీమ్ ఇండియా
సిరీస్పై కన్నేసిన ఇంగ్లాండ్
బ్రిస్టోల్లో మూడో టీ20 నేడు
రాత్రి 10 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
నవతెలంగాణ-బ్రిస్టోల్
టీ20 ప్రపంచ చాంపియన్ టీమ్ ఇండియా.. తొలిసారి ఈ ఫార్మాట్లో గడ్డు కాలం చూస్తోంది. 2018-19 నుంచి టీ20ల్లో వరుసగా రెండు సిరీస్లో ఓడని భారత్ ఇప్పడు ఆ ప్రమాదం ముంగిట నిలిచింది. ఐర్లాండ్ చేతిలో 0-2తో ఓడిన శ్రేయస్ సేన.. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి ప్రమాదంలో పడింది. టీమ్ ఇండియాపై ఇంగ్లాండ్ ముందెన్నడూ పొట్టి సిరీస్ సాధించలేదు. హ్యారీ బ్రూక్, బ్రెండన్ మెకకలమ్ ద్వయం అరుదైన ఈ రికార్డును బ్రిస్టోల్లోనే అందుకునేందుకు సిద్ధమవుతోంది. మాంచెస్టర్లో 125 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూసిన భారత్.. నేడు కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఓడితే, మరో మ్యాచ్ ఉండగానే ఆతిథ్య ఇంగ్లాండ్ సిరీస్ను సొంతం చేసుకోనుంది. భారత్, ఇంగ్లాండ్ నాల్గో టీ20 నేడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఆరంభం
.
బ్యాటర్లు మెరుస్తారా?
ఐర్లాండ్ టు ఇంగ్లాండ్ వరకు భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం అవుతున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన బ్యాటర్లు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆపసోపాలు పడుతున్నారు. టాప్ ఆర్డర్లో సంజు శాంసన్పై వేటు వేసి వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తెచ్చినా వ్యత్యాసం కనిపించటం లేదు. వైభవ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ మెరుపులా మెరిసి వెళ్లిపోయాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు పరిస్థితులకు తగిటనట్టు బాధ్యత తీసుకుని ఆడటం లేదు. ఆల్రౌండర్ శివమ్ దూబె సైతం బ్యాట్తో దారుణంగా నిరాశపరుస్తున్నాడు. తిలక్ వర్మ సైతం నిలకడ చూపించటం లేదు. బౌలింగ్ విభాగంలోనూ ఇదే పరిస్థితి. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు పత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయటంలో విఫలం అవుతున్నారు.
సిరీస్పై ఇంగ్లాండ్ గురి
ఆతిథ్య ఇంగ్లాండ్ ఒక్కసారిగా బలమైన జట్టుగా కనిపిస్తోంది. భారత జట్టు వైఫల్యమే ఇంగ్లాండ్ విజయానికి ప్రధాన కారణం. అయినా, భారత్పై తొలిసారి టీ20 సిరీస్ విజయం సాధించిన ఇంగ్లాండ్ కెప్టెన్గా నిలిచేందుకు బ్రూక్ ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్లో ఎవరూ ఒకరు క్రీజులో నిలిచి పరుగులు చేయటం ఆ జట్టుకు కలిసొచ్చింది. బంతితో జోఫ్రా ఆర్చర్ ఎక్స్ ఫ్యాక్టర్గా నిలుస్తున్నాడు. బ్రిస్టోల్ పిచ్ బౌండరీలు చిన్నవి. దీంతో బ్యాటర్లు బౌండరీలపై ఫోకస్ పెట్టడం సహజం. వైవిధ్యమైన బంతులు సంధించే బౌలర్లు మ్యాచ్ ఫలితాన్ని శాసించనున్నారు.



