కూలీలకు తప్పని భారం..
వీబీ-జీ రామ్ పథకంతో ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
వీబీ-జీ రామ్ జీ(వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్) చట్టం ఉపాధి కూలీలకు భారంగా మారింది. రక్షణ కల్పించాల్సిన పథకం అదనపు ఆర్థిక భారం మోపుతోంది. కేంద్రం కనీస సౌకర్యాలను కల్పించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేళ్ల నుంచి పనులు నిర్వహించేందుకు అవసరమైన పనిముట్లను అందించకపోవడంతో కూలీలే సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. మండలంలో మొత్తం జాబ్ కార్డులు 8,495,మొత్తం కూలీలు 18,873,యాక్టివ్ కూలీలు 10,632 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పూర్తి చేసిన కూలీలు ఒక్కరు మాత్రమే.
అదనపు భారం..
కేంద్ర ప్రభుత్వం గతంలో ఉపాధి కూలీలకు అవసరమైన గడ్డపారలు,తట్టలు, పారలను సరఫరా చేసింది.కూలీలు చెరువుల్లో పూడికతీత,పంట కాలువలు, కాంటూరు కందకాల తవ్వకం తదితర పనులకు వినియోగించారు. అయితే పది సంవత్స రాల నుంచి పనిముట్ల పంపిణీని ప్రభుత్వం నిలిపి వేసింది. దీంతో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు సొంతంగా పారలు, తట్టలు, గునపాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనిముట్ల కొనుగోలుతో ఒక్కో కూలీపై సుమారు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనపు ఆర్థిక భారం పడుతోంది.చాలీచాలని వేతనంతో పని చేస్తుండగా,కొత్తగా పనిముట్ల కొనుగోలుతో ఆర్థిక భారం పడుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పనిము ట్లను పంపిణీ చేయాలని కూలీలు కోరుతున్నారు.
ఆరంభమైన వేసవి..మండుతున్న ఎండలు
వేసవి కాలం ఆరంభం కావడంతో ఎండలు మండుతున్నాయి.ఈ నేపథ్యంలో కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రతకు కూలీలు భయ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పలు గ్రామాల్లో నీడ కోసం సరైన టెంట్లు లేకపోవడంతో చెట్ల కిందే తల దాచుకుంటున్నారు. పని చేసే ప్రాంతాల్లో మెడికల్ కిట్లు సైతం సరిగా అందుబాటులో ఉండడం లేదు. మెడికల్ కిట్ల పంపిణీని ప్రభుత్వం నిలిపేయడంతో..కూలీలకు గాయమైతే వైద్యం కోసం తాడిచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి.ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం,ఉప కేంద్రాల ద్వారా అయోడిన్, కాటన్ తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్ల పని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు.వేసవి కాలం ఆరంభమైన దృష్ట్యా పని చేసే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.
జీపీ ఆధ్వర్యంలో సౌకర్యాలు: హరీష్…ఉపాధి ఎపిఓ
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పని చేసే ప్రాంతాల్లో కూలీలకు సౌకర్యాలను కల్పిస్తున్నాం.కూలీలు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి టెంట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం. పని చేసే ప్రాంతం 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే రవాణా చార్జీలను చెల్లిస్తాం.



