అంబేద్కర్ యూనివర్శిటీలో ఎస్ఎఫ్ఐ నేతలపై
అక్రమ బహిష్కరణకు ఏడాది : ఎస్ఎఫ్ఐ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ఏయూడీి)లో క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షుడు సుభాజ్ జగద్, రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఇలామోన్, సెంట్రల్ ఢిల్లీ ఏరియా కార్యదర్శి నిష్టా, ఏయూడీ యూనియన్ సభ్యులు అమిష్, గార్గి మాట్లాడారు. ఏబీవీపీ నేతృత్వంలో క్యాంపస్లో జరిగిన ర్యాగింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపొందిన ఎస్ఎఫ్ఐ నేతలను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించి ఏడాది కావస్తోందని, వారిపై ఇప్పటికీ బహిష్కరణ వేటు ఎత్తివేయలేదని అన్నారు. ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయూడీ యూనియన్ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయం వారికి మొదటి ఎదురుదెబ్బని తెలిపారు. ఢిల్లీలో సంస్థాగత ప్రాతిపదికన ఎన్నికలు జరిగే ఏకైక రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏయూడీ అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడ ఏబీవీపీని..ఎస్ఎఫ్ఐ ఓడించినప్పటి నుంచి, అధికారులు ఎన్నికైన యూనియన్ ఆఫీస్ బేరర్లపై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించారని విమర్శించారు. ఇవి ఎస్ఎఫ్ఐ లక్ష్యంగా చేసుకున్న చర్యలని అన్నారు. విసి అను సింగ్ లాథర్ విశ్వవిద్యాలయం స్వభావాన్నే మార్చేశారని, విద్యార్థుల అన్ని రకాల హక్కులను హరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ దినోత్సవాన్ని తన చిత్ర పటంతో జరుపుకున్నప్పుడు, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉగ్రవాదులని పేర్కొంటూ అవమానించాడని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టిన విశ్వవిద్యాలయంలో ఇదంతా జరగడం దారుణమని తెలిపారు.
క్యాంపస్ ప్రజాస్వామ్య నాశనానికి యత్నాలు
- Advertisement -
- Advertisement -



